గో సంర‌క్షణ‌కు సమగ్ర విధానం.. వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

గో సంర‌క్షణ‌కు సమగ్ర విధానం.. వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
  • ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేయండి
  • వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా గోశాల ఉండాలి
  • గో సంర‌క్షణ విషయంలో  ఎంత ఖర్చు అయినా వెనకాడబోమని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో గో సంర‌‌క్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేసేందుకు ముగ్గురు అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌‌రావుతో కూడిన ఈ కమిటీ లోతైన అధ్యయనం చేయాలని సూచించారు.

 మంగళవారం (june 17) సాయంత్రం తన నివాసంలో గో సంర‌‌క్షణపై అధికారులతో సీఎం రేవంత్‌‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని, గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని తెలిపారు. 

అత్యాధునిక వసతులతో గోశాలలు..

భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని, అయితే స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని సీఎం రేవంత్​రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని 4  ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని  సూచించారు. 

ముఖ్యంగా ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వ విద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో గోశాలలను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని తెలిపారు. గో సంర‌‌క్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ఖర్చుకైనా వెనకాడబోదని చెప్పారు. 

రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్‌‌ను సీఎం రేవంత్​రెడ్డికి అధికారులు అందజేశారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్‌‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ గోపి, రంగారెడ్డి  కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.