
హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాలోని ప్రతి చుక్కా నీటిని తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు.. బెదిరేది లేదని.. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను తీసుకుని తీరుతామని తేల్చి చెప్పారు. 4 కోట్ల ప్రజల పక్షాన తెలంగాణ హక్కులను సాధించుకుంటామన్నారు.
తెలంగాణకు నీరు ఇచ్చాకే మిగితా ఎవరికైనా ఇచ్చేదన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసిన తిప్పికొట్టే బాధ్యత మాదని అన్నారు. 79 భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ తెలంగాణకు బలమని.. రాష్ట్ర రాజధానిలో సగర్వంగా మిస్ వరల్డ్ కాంపిటిషన్ నిర్వహించుకున్నామని గుర్తు చేశారు.
ప్రపంచ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ను మరింత తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని.. ఇందు కోసం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యమెంటరీని ఈ ఏడాది డిసెంబర్ కల్లా రిలీజ్ చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం గోదావరిలో కలిసిపోయిందని విమర్శించారు.