తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు. ధరణి పోర్టల్ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని అధికారులను సీఎం ప్రశ్నించారు. లక్షలాది రైతుల భూరికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారన్నారు సీఎం. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని సీఎం ప్రశ్నించారు.
ధరణిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్ది ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోగా అన్ని మండాల కేంద్రాల్లో పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి కమిటీ సూచలను పరిగణలోనికి తీసుకుని విధివిధనాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పగా వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.