- హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠకు సీఎం రేవంత్ వినతి
- పాత అప్పులను రీస్ట్రక్చర్ చేయాలి
- అదనంగా 10 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు లోన్లు ఇవ్వాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను సీఎం రేవంత్రెడ్డి కోరారు. అత్యధిక వడ్డీ రేట్లతో తీసుకున్న పాత రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సంజయ్ కులశ్రేష్ఠతో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చ జరిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారి, బుల్లెట్ రైలు నిర్మాణాలపై డిస్కస్ చేశారు. సానుకూల వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకు సాగుతున్నదని, రుణాల విషయంలో సహాయం చేయాలని కులశ్రేష్ఠను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
గ్లోబల్ సమిట్కు ఆహ్వానం
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన రుణాల అంశంపై కులశ్రేష్ఠతో సీఎం రేవంత్చర్చించారు. ఈ ఇండ్ల కోసం ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని కులశ్రేష్ఠ తెలిపారు. రాష్ట్రంలో మరో 10 లక్షల ఇండ్ల నిర్మాణాల కోసం రుణాలను వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా, చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న భారత్ గ్లోబల్ సమిట్కు హాజరుకావాలని హడ్కో చైర్మన్ కులశ్రేష్ఠను సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు.
సమావేశంలో మంత్రి పొంగులేటి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, హడ్కో రీజినల్ చీఫ్ సుభాశ్రెడ్డి, జాయింట్ జనరల్ మేనేజర్ ఆశిష్ గుండాల, పాల్గొన్నారు.
