
- ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
- రేడియల్ రోడ్ల పనులు స్పీడప్ చేయాలి
- అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- ట్రిపుల్ ఆర్ సౌత్, రేడియల్,ఇతర రోడ్లపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాబోయే 50 ఏండ్ల అవసరా లకు తగ్గట్టుగా రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) సౌత్ అలైన్ మెంట్ ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ట్రిపుల్ఆర్తోపాటు రేడి యల్ రోడ్లు, జంక్షన్ల అనుసంధానం ఉండాలని సూచించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ట్రిపుల్ ఆర్ సౌత్, రేడియల్ రోడ్లు, ఇతర రోడ్లపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు. ట్రిపుల్ఆర్ (సౌత్)కు సంబంధించిన అలైన్మెంట్ను పరిశీలించి పలు మార్పులు సూచించారు. అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విష యంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని అధికారు లను ఆదేశించారు.
అలైన్మెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అన్నారు. శాటిలైట్ టౌన్షిప్స్, ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే నేషనల్ , స్టేట్ హైవేలు ట్రిపుల్ ఆర్ బయటకు వెళ్లే ప్రాంతంలో తగిన రీతిలో ట్రంపెట్స్ నిర్మించాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటేలా చూడాలని సూచించారు.
నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసుకోవాలి
హైదరాబాద్–-శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్ నూతన అలైన్మెంట్కు సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మార్గంలో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలన్నారు.
ఈ కొత్త రోడ్లకు సంబంధించి నేషనల్ హైవే అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ , సెక్రటరీ దాసరి హరిచందన, మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం అదనపు సీఈవో ఈవీ నరసింహారెడ్డి, ఎన్హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ శివశంకర్ పాల్గొన్నారు.