విద్యకే తొలి ప్రాధాన్యం.. చదువుతోనే తలరాత మారుతది: సీఎం రేవంత్ రెడ్డి

విద్యకే తొలి ప్రాధాన్యం.. చదువుతోనే తలరాత మారుతది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: విద్యాశాఖకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యతో పాటు నైపుణ్య శిక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. విద్య ఒక్కటే మన తలరాతను మార్చగలదని, భవిష్యత్‌లో వెలుగులు తీసుకొచ్చేది విద్యేనని అన్నారు.నెహ్రూ వేసిన పునాదులపైనే ప్రస్తుతం విద్యాసంస్థలు నడుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల

ప్రతి గూడెంలో సింగిల్ టీచర్ స్కూల్ ఏర్పడిన పరిస్థితి ఉందని సీఎం అన్నారు. ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.విద్యతో పాటు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రపంచ విద్యావిధానం ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిందని, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలో మనం ఉన్నామని సీఎం పేర్కొన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. పేదలు, దళిత వర్గాలు నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువే ప్రధాన కారణమన్నారు.

కొన్ని సామాజిక వర్గాలు గతంలో గొర్రెలు, మేకల పెంపకం వంటి సంప్రదాయ వృత్తులకే పరిమితమై చదువులకు దూరమయ్యాయని సీఎం వ్యాఖ్యానించారు. ఆస్తులు ఉన్నప్పటికీ చదువుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొన్ని వర్గాలు వెనుకబడ్డాయని చెప్పారు.చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దేశానికి ఆదర్శంగా విద్యా విధానం

తెలంగాణలో అత్యుత్తమ విద్యా విధానాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. ఇందుకోసం అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకుంటామని చెప్పారు. విద్యారంగంలో ఆధునిక విధానాలను తీసుకురావడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి కమిషన్ సభ్యులు అందించే విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.

విద్యాశాఖకు ప్రభుత్వం క్రమంగా బడ్జెట్ కేటాయింపులు పెంచుతోందని సీఎం వివరించారు.2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 6.53 శాతం కేటాయించామని తెలిపారు.2024-25లో విద్యపై 7 శాతానికి పైగా ఖర్చు చేశామని చెప్పారు.2025-26లో విద్యపై 8 శాతానికి పైగా ఖర్చు చేశామని వెల్లడించారు.2025-26లో విద్యకు రూ.23,729 కోట్లు కేటాయించామని తెలిపారు.2026-27లో విద్యాశాఖకు రూ.27,663 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.భవిష్యత్‌లో రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయించాలన్నది తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.గత మూడేళ్లలో విద్యాశాఖ కోసం రూ.7,554 కోట్లు అదనంగా ఖర్చు చేశామని సీఎం తెలిపారు.2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు రూ.18,955 కోట్లు కేటాయించిందని, తమ ప్రభుత్వం 2025-26లో రూ.23,729 కోట్లు, 2026-27లో రూ.27,663 కోట్లు కేటాయించిందని వివరించారు.

విద్యాశాఖపై నాకున్న ఆసక్తితోనే నా దగ్గర 

విద్యాశాఖపై తాను సమీక్ష నిర్వహిస్తే ‘విద్యాశాఖ మంత్రి సమీక్ష’ అని కాకుండా ‘సీఎం సమీక్ష’ అని అంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరని కొందరు విమర్శిస్తున్నారని, అయితే అంతకుమించి తానే విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. విద్యాశాఖపై తనకున్న ఆసక్తి కారణంగానే ఆ శాఖను తన వద్ద ఉంచుకున్నానని తెలిపారు.పేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నానని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 24,966 ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్రంలో మొత్తం 24,966 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 19,79,614 మంది విద్యార్థులు, 1,24,456 మంది ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు.అదేవిధంగా రాష్ట్రంలో 444 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో సుమారు 1.95 లక్షల మంది విద్యార్థులు, 6,359 మంది లెక్చరర్లు ఉన్నారని తెలిపారు.

వైఎస్సార్ హయాంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. విద్యా రంగంలో చేపట్టాల్సిన మరిన్ని సంస్కరణలపై అధ్యయనం చేసేందుకు నిర్వహించిన సర్వే ద్వారా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. విద్యను మరింత ఆధునికంగా, నాణ్యంగా మార్చి ప్రపంచ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.