ప్రజా ప్రభుత్వంలో దళితులకు ప్రాధాన్యం: సీఎం రేవంత్

ప్రజా ప్రభుత్వంలో దళితులకు ప్రాధాన్యం: సీఎం రేవంత్
  • కులం కన్నా చదువుతోనే గుర్తింపు
  • నేను మీలో ఒకడిని.. మీతోనే ఉంటున్నా
  •  దొరల పాలనకు ప్రజాప్రభుత్వానికి తేడా ఇదే
  •  గత ప్రభుత్వం నిరుద్యోగులకు కొలువులివ్వలే
  • తన ఇంట్లో వాళ్లకు పదవులు తెచ్చుకుంది
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రజాప్రభుత్వంలో దళితబిడ్డలకు పట్టం కట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కీలక పదవుల్లో అట్టడుగు వర్గాల వారిని నియమించామని చెప్పారు. కులం కన్నా చదువే ముఖ్యమని అన్నారు. విద్య ద్వారానే సామాజిక రుగ్మతలను పారదోల వచ్చని చెప్పారు. బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకులాల విద్యార్థులకు బహుమతులను ప్రదానం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం అంటే గాలి నుంచి ఉడి పడలేదు అన్నారు. మీ మద్యలో ఉంట .. మీతోనే ఉంటానని పేర్కొన్నారు. గడ్డం వంశీ కృష్ణ, కడియం కావ్యకు చదువుతోనే గుర్తింపు వచ్చిందని, చిన్న వయసులోనే ఎంపీలు అయ్యారని అన్నారు. గడ్డం వినోద్ అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతారని కితాబునిచ్చారు. తనకు ఇంగ్లీష్ అనగానే తనకు గడ్డం వినోద్ గుర్తుకు వస్తారని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన  పదవుల్లో దళితులకు పెద్దపీట వేశామన్నారు, వీసీలుగా ఇద్దరి నియమించామని గుర్తు చేశారు.  విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించినట్టు తెలిపారు. 

వందేండ్ల ఉస్మానియా వర్సిటీ చరిత్రలో ఇంత వరకు దళితుడు వీసీ కాలేదని, ప్రజాప్రభుత్వంలో ఆ అవకాశం వచ్చిందని చెప్పారు. అంబేద్కర్ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణిని, బాసర ట్రిపుల్ ఐటీ వీసీగా గోవర్ధన్  ను  నియమించామని అన్నారు. తమకు చదువు విలువ తెలుసునని,  విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై ఓ రాజకీయ పార్టీ పత్రిక ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్కూల్ కి అంతా ఖర్చు ఎందుకు అని రాసుకొచ్చారని అన్నారు. గత ప్రభుత్వం అణగారిన వర్గాలను విద్యకు దూరం చేసి గొర్రెలు, బర్రెలు, చేపలు ఇచ్చిందని, తమకు విద్య ప్రాధాన్యం తెలుసునని సీఎం అన్నారు.  పదేండ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటం ఆడుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. 

ALSO READ | ప్రపంచంలో ఇలాంటి స్కూళ్లు ఎక్కడ లేవు: భట్టి

ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని అన్నారు. పెట్టుబడులను తీసుకొచ్చి పరిశ్రమలు  పెట్టించి మరో లక్ష ఉద్యోగాలను రాష్ట్రంలో సృష్టించగలిగామని అన్నారు. గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తామని మాట తప్పిందని అన్నారు. తాము పరీక్ష నిర్వహించి 563 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైతే అడ్డుకుంటూ కేసు వేసిందని చెప్పారు.  తాను ప్రభుత్వ  విద్యాసంస్థల్లోనే చదువుకున్నానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విడివిడిగా రెసిడెన్షియ్ స్కూల్స్ పెట్టడం ద్వారా విద్యార్థులలో ఆత్మన్యూనత భావం ఏర్పడుతుందన్నారు. దీనిపై ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశానికే ఆదర్శంగా ఉండేలా యంగ్ ఇండియా ఇండిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం తీసుకువచ్చామన్నారు.