- పెట్టుబడికి తగిన ప్రతిఫలం రైతుకు దక్కాలి
- సీఈటీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి
- ముగిసిన దావోస్ పర్యటన..లండన్కు పయనం
హైదరాబాద్, వెలుగు: " నేను రైతు బిడ్డను. వ్యవసాయం మా సంస్కృతి. రైతులను ధనికులను చేయడమే నా లక్ష్యం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్లో డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశంలో ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్పై నిర్వహించిన సీఈటీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారత్ లో వ్యవసాయం, రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయన్నారు. రైతులు తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారికి సకాలంలో బ్యాంకు రుణాలు కూడా అందడం లేదని చెప్పారు. టెక్నాలజీ అందుబాటులో లేక వ్యవసాయంలో లాభాలను పొందలేకపోతున్నారని వివరించారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ప్రారంభించిందని తెలిపారు. కార్పొరేట్ రంగంలో పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం మాదిరిగా రైతులకు లాభాలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా లాభాలు వస్తే 99 శాతం రైతు ఆత్మహత్యలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
38 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ
తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంగా మూడు రోజులపాటు సాగిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దాదాపు రూ.38 వేల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి మెుగ్గు చూపించాయి. వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉబర్ కంపెనీ హైదరాబాద్ లో తమ సేవలను విస్తరించనుంది. దావోస్ పర్యటన అనంతరం సీఎం లండన్ కు చేరారు. ఆయన రెండు రోజులు అక్కడ పర్యటించనున్నారు.
హైదరాబాద్లో సిస్ట్రా గ్రూప్ డిజిటల్ సెంటర్
హైదరాబాద్ కేంద్రంగా డిజిటల్ సెంటర్ ఏర్పాటుకు సిస్ట్రా గ్రూప్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం లో సిస్ట్రా గ్రూప్ సీఈవో పియర్ వెర్జాట్తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైయ్యారు.
క్యూ సెంట్రియో కంపెనీతో ఒప్పందం
రాష్ట్రంలో ఐటీ డెవెలప్ మెంట్, సర్వీసెస్ అందించే క్యూ సెంట్రియో కంపెనీ రాష్ట్రంలో వారి కార్యకలాపాలను విస్తరించనుంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి సమావేశమయ్యారు. యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. రాబోయే రెండు మూడు ఏండ్లలో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని కంపెనీ ప్రకటించింది.