మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌:  మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 16వ తేదీ శనివారం రాష్ట్ర శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల హక్కులను కాపాడడం కోసం తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని.. ప్రజాస్వామిక పాలన అందిస్తామని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉండాలని.. ఏ సమస్యపై అయినా ధర్నా చౌక్ వద్ద అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మా ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు.  గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పిలర్లు కుంగిపోవడంపై విచారణ జరిపిస్తామన్నారు సీఎం.  

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనను తీసుకువెళ్తానని.. ఎందుకు కుంగిపోయిందో.. తెలుసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామన్నారు. అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయని... కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు?.. వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు?.. అధికారుల పాత్ర ఉందా? అనే విషయాలు విచారణలో బయటకు వస్తాయని  -సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.