పురిటిగడ్డ రుణం తీర్చుకోండి

పురిటిగడ్డ రుణం తీర్చుకోండి
  •      తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. 
  •     మీరు పెట్టే ప్రతి రూపాయికి నాదీ గ్యారెంటీ
  •     న్యూజెర్సీలో ఎన్నారైలతో సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : “తెలంగాణలో మీవంతుగా పెట్టుబడులు పెట్టండి.. మీరు పెట్టిన ప్రతి రూపాయికీ ఎన్నోరెట్లు ప్రయోజనం చేకూరుతుంది.. అందుకు నాదీ గ్యారంటీ’’ అని అమెరికాలోని తెలుగువారికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో తెలుగు ఎన్నారైలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా టూర్ లో భాగంగా న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. 

వేలాది మంది ఎన్నారైలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ మీ జన్మభూమి, మీ పురిటిగడ్డ మీద మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకుమించిన సంతృప్తి  మీకు బోనస్ గా లభిస్తుంది” అని అన్నారు.

 సాఫ్ట్ వేర్, ఫార్మా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్  తదితర రంగాల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఎదిగేలా చర్యలు తీసుకోననున్నట్లు ఆయన వివరించారు. దీనికి ప్రవాస భారతీయుల  సహకారం అవసరమని, పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకోసమే తాను అమెరికాకు వచ్చినట్లు చెప్పారు. తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని చెప్పారు. 

హైదరాబాద్​ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీపై ఎంతో విష ప్రచారం జరిగిందని, గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారని, వచ్చినా అది ఉండనే ఉండదని కామెంట్లు చేశారని సీఎం రేవంత్​ అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని,  ఇప్పటికే  అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పామని, అబద్ధాలకోరుల మాటలు తప్పని మరోసారి నిరూపిస్తామని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌‌‌‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడుతామని స్పష్టం చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అమెరికా వచ్చానని.. తెలంగాణలో పదేండ్ల దుర్మార్గపు, మోసపూరిత ప్రభుత్వాన్ని అంతమొందించి, కాంగ్రెస్ ప్రజా పాలనను తీసుకొస్తామని అప్పుడే మాట ఇచ్చానని.. ఇప్పడు ఆ మాట నిలబెట్టుకున్నానని సీఎం రేవంత్​ తెలిపారు. 

అధికారంలోకి వచ్చీ రాగానే చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తాము అధికారంలోకి రాగానే విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, టీచర్లకు..ఇలా ప్రతి వర్గానికి ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తున్నామని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి తాము కంకణ బద్ధులమై ఉన్నామన్నారు. పాలనలో సమతుల్యతను పాటిస్తూ, భవిష్యత్తులో వేగవంతమైన రాష్ట్ర స్థిర ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

పెట్టుబడుల కోసం తమ వంతుగా..!

రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా చూడాలన్న తమ కల నెరవేరిందని ఎన్నారై అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ గిల్జియాన్​ అన్నారు.  ఇపుడు రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానిగా చూడాలన్నదే మిగిలిందని, అది కూడా రాబోయే రోజుల్లో నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 అనంతరం ఎన్నారైలు సీఎం రేవంత్​రెడ్డికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు చేస్తున్న కృషిని.. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను వారు ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని సీఎం రేవంత్​తో వారు అన్నారు. 

ఇకపై తెలంగాణకు మీ సేవలు అవసరం

‘‘మీ నైపుణ్యాలు, మీ ప్రతిభాపాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్న దేశంగా మార్చారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా మూడు వలయాలుగా విభజించాం. మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగానే నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం” అని అమెరికాలోని తెలుగువారితో సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ప్రపంచ స్థాయి మాస్టర్‌‌‌‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఇన్వెస్టర్లతో భేటీ

ఎన్నారైలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో మాట్లాడారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఏర్పాటు కాబోయే భారీ కార్పొరేట్ సంస్థల గురించి వివరించారు. ఇందులో  అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ వరకు భారీ కాన్యాయ్ తో సీఎం రేవంత్​కు ఎన్నారైలు స్వాగతం పలికారు.