అమెరికన్ కంపెనీలకు భారత్ ఫ్యూచర్ సిటీ లో భాగస్వామ్యం : సీఎం రేవంత్ రెడ్డి

అమెరికన్ కంపెనీలకు  భారత్ ఫ్యూచర్ సిటీ లో భాగస్వామ్యం : సీఎం రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్​లో గేమ్​చేంజర్ ప్రాజెక్టులు చేపడ్తున్నం: సీఎం రేవంత్​ రెడ్డి
  • చైనా ప్లస్1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపిక
  • అమెరికా ప్రతినిధుల బృందంతో భేటీ
  • 2034  నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని వెల్లడి
  • పెంచిన సుంకాలు, హెచ్ 1బీ వీసా నిబంధనలపై ఆందోళన

హైదరాబాద్, వెలుగు: అమెరికా నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో.. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా పెంచిన సుంకాలు, హెచ్ 1బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావం చేయడంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయన్నారు.  రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. తెలంగాణకు వచ్చిన అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం  తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

అమెరికాలోని హడ్సన్  ఇన్ స్టిట్యూట్ కు చెందిన 16 మంది ప్రతినిధులు గురువారం సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్  భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తున్నదని స్పష్టం చేశారు. 30 వేల ఎకరాల్లో హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్న భారత్  ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వనిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని, ఫ్యూచర్  సిటీలో పాలుపంచుకోవాలని కోరారు. ‘చైనా ప్లస్1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని సీఎం చెప్పారు. 

న్యూయార్క్, టోక్యోతో హైదరాబాద్  పోటీ

ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా  హైదరాబాద్  ప్రపంచ నగరంగా అందరినీ ఆకర్షిస్తోందని, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్  రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్  ఇప్పుడు న్యూయార్క్, టోక్యో , దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని, మన మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ప్రపంచ ప్రమాణాలకు సవాలుగా ఉందని ఆయన అన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో రాష్ట్రం  అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి ఒక ట్రిలియన్  ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల  ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 

హైదరాబాద్ లో గేమ్- చేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ‘‘భారత్  ఫ్యూచర్  సిటీతో పాటు రీజినల్  రింగ్  రోడ్, రీజినల్  రింగ్  రైల్, మ్యానుఫ్యాక్చర్  జోన్లు అభివృద్ధి చేస్తున్నాం. డ్రై పోర్ట్  ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఏపీలోని మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్  కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నాం. హైదరాబాద్  నుంచి చైన్నై, బెంగుళూరుకు బుల్లెట్  ట్రైన్  ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అభివృద్ధి చేస్తాం. సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్  తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త మార్గాలను తెరుస్తుంది” అని సీఎం వివరించారు. 

దేశానికే స్కిల్​ క్యాపిటల్​ హైదరాబాద్: శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏఐ సిటీతో పాటు ఆర్టిఫిషియెల్  ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు  తెలిపారు. ఏఐ రంగంలో  రాష్ట్రాన్ని దేశానికే స్కిల్  క్యాపిటల్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  ఇప్పటికే పేరొందిన కంపెనీలు హైదరాబాద్ లో గ్లోబల్  కెపాసిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని, వీటిని గ్లోబల్  వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్  నుంచి వచ్చే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్  వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ప్రధాన వాటాను సరఫరా చేశాయని, స్వదేశీ కంపెనీలను మరింత పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 

హడ్సన్  ఇన్ స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి, వాల్ స్ట్రీట్  జర్నల్  కాలమిస్ట్  ప్రొఫెసర్  వాల్టర్  రస్సెల్  మీడ్, రేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్  క్యాపిటల్  పార్టనర్స్  సీఈవో మార్క్ రోసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లాట్, క్రౌ హోల్డింగ్స్  చైర్మన్  హర్లాన్ క్రో, ఈగిల్  క్యాపిటల్  మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్  వ్యవస్థాపకుడు రావెనెల్ కర్రీ, బిల్లింగ్స్లీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్సీతో పాటు మొత్తం 16 మంది అమెరికా ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ప్రిన్సిపల్  సెక్రటరీ రిజ్వీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్  సిటీ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ కమిషనర్  కె.శశాంక, ఇండస్ట్రీస్  డైరెక్టర్  నిఖిల్ చక్రవర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు.