రైతులను మోసం చేస్తే సహించం: సీఎం రేవంత్​రెడ్డి

రైతులను మోసం చేస్తే సహించం: సీఎం రేవంత్​రెడ్డి
  •      వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్​ లైసెన్సులు రద్దు
  •      కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్​లో పెడ్తం
  •      మిల్లర్లు, ట్రేడర్లకు సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరిక
  •     పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సమస్యలు రావొద్దు
  •     నాగార్జునసాగర్​ డెడ్​ స్టోరేజీ, సింగూరు, నారాయణపూర్​ రిజర్వాయర్ల నుంచి తాగునీళ్లు
  •     రాబోయే రెండు నెలలు అలర్ట్​గా ఉండాలి
  •     ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటు తప్పదు
  •     ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి
  •     వడ్ల కొనుగోళ్లు, తాగునీటిపై రివ్యూలో ఆఫీసర్లకు ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తాగునీటి విషయంలో రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్ కు తెచ్చుకోవాలని, అందుకు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సింగూర్ నుంచి కూడా నీటి సరఫరాకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్​లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆయన సూచించారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై శుక్రవారం సెక్రటేరియెట్​లో మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి సీఎం రేవంత్​ రెడ్డి రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల  ట్రేడ్ లైసెన్స్​లు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని ఆదేశించారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. 

వడ్లు ఆరబెట్టేందుకు యార్డుల్లో ఏర్పాట్లు

ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఒకటి రెండు రోజులు ఆరబెట్టి మంచి రేటు పొందాలని సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరుగకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఎన్నికల టైమ్ కావడంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశపూర్వక కథనాలు వస్తున్నాయని, అటువంటివాటిపై వెంటనే ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొను గోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని చెప్పారు. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలని ఆయన అన్నారు. తాగునీటి సరఫరా కోసం ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. 

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమన్నారు. నిరుటితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని చెప్పారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడిపోవడంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. ఏ రోజుకారోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు.

 ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్​లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఈ సందర్భంగా సీఎం దృష్టికి వచ్చింది. ఉద్దేశపూర్వ కంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా ప్రభు త్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.