
- సీఎం రేవంత్ దావోస్ టూర్.. 30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
- పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా సీఎం దావోస్ టూర్
- పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేలా
- సీఎం రేవంత్ దావోస్ టూర్
- ఫార్మా, ఆగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్పై ఫోకస్
- పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ వచ్చారు. ఇప్పుడు దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారీగా ఇన్వెస్ట్మెంట్లను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
పెద్ద కంపెనీలు వాటి వివిధ విభాగాల వ్యాపార విస్తరణకు తెలంగాణను డిస్టినేషన్గా మార్చాలని చూస్తున్నారు. దావోస్ పర్యటనలో కనీసం రూ.25 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల మేర పెట్టుబడులు రప్పించాలని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రంలోని యువతకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పించే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి సంబంధించిన మెగా మాస్టర్ పాలసీ ఎలా ఉంటుందనే దానిపై దావోస్ మీటింగ్లో ఇండస్ట్రియలిస్ట్లకు సీఎం తెలియజేయనున్నారు.
రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే వివిధ ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న యువతకు ఎంప్లాయిమెంట్ కల్పించాలనుకుంటున్నది. హైదరాబాద్తోపాటు రాష్ట్రమంతటా పరిశ్రమల అభివృద్ధికి కసరత్తు చేస్తున్నది. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ నెల 15 నుంచినాలుగు రోజులు సీఎం రేవంత్ పాల్గొని పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనలపై ఆయన చర్చలు జరుపనున్నారు.
ఫార్మా, ఆగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్పై ఫోకస్
రాష్ట్రంలో అనుకూలమైన భౌగోళిక వాతావరణం, రవాణా సదుపాయాలు, అపారమైన వనరులను దృష్టిలో ఉంచుకొని ఫార్మా, ఆగ్రో, హెల్త్, రియల్ ఎస్టేట్ రంగాలన్నింటినీ విస్తరించాలని రాష్ట్ర సర్కారు అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ విధానంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.