మూడేండ్లలో మూసీ తీరం మెరవాలె: సీఎం రేవంత్ రెడ్డి

మూడేండ్లలో మూసీ తీరం మెరవాలె: సీఎం రేవంత్ రెడ్డి
  • తొలి దశలో 55 కిలోమీటర్లమేర అభివృద్ధి చేయాలి 
  • హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తొలుత హైదరాబాద్ సిటీ పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్‌‌ చేయాలన్నారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై మంగళవారం నానక్‌‌రామ్ గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అమ్యూజ్‌‌మెంట్ పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం విదేశాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్ట్‌‌ల డిజైన్లు పరిశీలించాలని చెప్పారు. 

మూడు నెలల్లోగా సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకునే విధంగా డిజైన్‌‌ ఉండటంతో పాటు వర్షపు నీటిని మూసీలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలు చార్మినార్, తారామతి బరాదరీ, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ డిజైన్ రూపొందించాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్‌‌ను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.