గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‎కు సీఎం రేవంత్ సవాల్

గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‎కు సీఎం రేవంత్ సవాల్
  • కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం
  • నీ బోడి సలహాల వల్లే 2016లో బనకచర్లకు పునాదులు
  • నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే నువ్వు  
  • కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నువ్వు కాదా? 
  • నీ హయాంలోనే ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్‌‌‌‌కు జీవోలు
  • పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఏం చేసినవ్​?
  • చేసిన తప్పులకు ముఖం చెల్లక ఇప్పుడు ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో పడుకున్నవ్
  • మేం నీ లెక్క చేస్తలేం.. బనకచర్లపై కేంద్రాన్ని హెచ్చరించినం  
  • ఏపీకి సహకరిస్తే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పినం 
  • బీఆర్​ఎస్​, కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని రైతులకు పిలుపు 
  • సెక్రటేరియెట్​ వద్ద రైతు నేస్తం సభలో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు:  గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘గోదావరి నీళ్ల దొంగలెవరో తేలుద్దాం.. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? ఎదురెదురుగా నిలబడి మాట్లాడుదాం.. ఎవరివి నిజాలు.. ఎవరు జీవోలు ఇచ్చిన్రు.. ఎవరు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన్రు.. ఎవరు ధోకా చేసిన్రు.. ఎవరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందో చర్చించేందుకు సిద్ధమా?’’ అని సవాల్ చేశారు. 

‘‘ఒకరోజు గోదావరి, రెండో రోజు కృష్ణా జలాల మీద చర్చిద్దాం. ఇందుకోసం ప్రతిపక్ష నేతగా స్పీకర్‌‌‌‌కు మీరే లేఖ రాయండి. మీకు ఏ తారీఖు వీలవుతుందో అదే రోజు సమావేశాలు పెడదాం” అని చెప్పారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా మంగళవారం సెక్రటేరియెట్ వద్ద ‘రైతు నేస్తం’ పేరుతో వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడారు. గోదావరి, కృష్ణా నీళ్లలో తెలంగాణకు మరణశాసనం రాసిందే కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ‘‘కేసీఆర్ బోడి సలహాల వల్లే 2016లో బనకచర్లకు పునాదులు పడ్డాయి. 400 టీఎంసీలను బనకచర్లతో హంద్రీనీవాకు తరలించేందుకు ప్రణాళికలు అప్పుడే రూపొందాయి. ఈ విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది ముమ్మాటికీ కేసీఆరే. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్​ట్రిబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. 

రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెట్టి.. 512 టీఎంసీలు ఏపీకి అప్పగించి,  299 టీఎంసీలు మాకు సరిపోతాయంటూ సంతకం పెట్టింది నువ్వు (కేసీఆర్) కాదా..? 2018లో వ్యాప్కోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించింది నిజం కాదా..? ఇయ్యాల కాగితాలను శాసన సభ ముందు పెడతా.. నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా..? ఇది తెలంగాణకు శాశ్వత అన్యాయం కాదా..? నీ దిక్కుమాలిన  సలహాల వల్లే ఈ దరిద్రం దాపురించిన మాట వాస్తవం కాదా..? రోజమ్మ పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయి రత్నాలసీమ చేయండని చెప్పింది నువ్వు కాదా..?” అని నిలదీశారు. 

మామ శకుని.. అల్లుడు శనీశ్వరుడు 

తెలంగాణకు అన్యాయం జరిగితే తాము బీఆర్ఎస్ లెక్క చూస్తూ ఊరుకోబోమని, కేంద్రానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డి వచ్చాక బనకచర్ల మొదలుపెట్టినట్లు, చంద్రబాబు నాయుడుకు దగ్గరుండి నీళ్లు ఇస్తున్నట్లు.. దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలనుకుంటే అక్కడనే ఉండేటోణ్ణి కదా.   రాహుల్​గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చేటోడిని. కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం ఎందుకు తెచ్చెటోడిని. కేసీఆర్​లెక్క మేం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పొచ్చినం. ‘మీరు వాళ్లకు (ఏపీ) సహకరిస్తే సుప్రీం కోర్టులో కలుసుకుందాం.. మీ సంగతి, వాళ్ల సంగతి అక్కడ తేల్చుకుందాం’ అని కేంద్రాన్ని హెచ్చరించినం. 

ఇదీ మా చిత్తశుద్ధి. నువ్వా (కేసీఆర్) మమ్మల్ని ప్రశ్నించేది?’’ అని ఫైర్​అయ్యారు. ‘‘సచ్చిపోయిన పార్టీకి సంజీవని గోదావరి జలాలే.. సచ్చినోడిని బతికించేది గోదావరి జలాలే అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎవరో చెప్పారు. అసెంబ్లీలో అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. శాసన మండలికి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలే. తెలంగాణలో బీఆర్ఎస్​పార్టీ చచ్చిపోయింది. ఆ సచ్చిన పాము గోదావరి జలాల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మంటలు పెట్టి మళ్లీ బతుకుతుందట’’ అని మండిపడ్డారు. కేసీఆర్ శకుని మామ అయితే, ఆయన అల్లుడు హరీశ్​రావు శనీశ్వరుడు అని విమర్శించారు. ‘‘రైతులకు ఏం చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు రైతు బంధు ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మారు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మారు.  రైతుల పేరుమీద అప్పులు చేశారు... దోపిడీ చేశారు. కాళేశ్వరం పేరుమీద లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇద్దరి పాలనపై చర్చ పెట్టండి..

పదేండ్ల కేసీఆర్ పాలన, 18 నెలల తమ పాలన ఎలా ఉందో చర్చ పెట్టాలని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘పదేళ్ల కేసీఆర్ పాలనను, 18 నెలల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. చెట్ల కింద, పెండ్లిళ్ల దగ్గర.. దావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో చర్చించండి. 2004లో సోనియా గాంధీ నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్​ఇచ్చింది. కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు మాఫీ చేసింది. ఇప్పుడు మా ప్రజా ప్రభుత్వం రైతులను మొదటి ప్రాధాన్యంగా తీసుకుంది’’ అని చెప్పారు. తమ ప్రభుత్వం 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, జీరో వడ్డీ రుణాలు, స్వయం సహాయక సంఘాలకు వ్యాపార అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. 


‘‘మేం వ్యవసాయాన్ని పండుగలా మార్చాం. రైతును రాజుగా చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం కార్యక్రమంతో యువతను ఆదుకునేందుకు కృషి చేస్తాం. మా ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతుల. ఆ తర్వాత ఆడబిడ్డలకు, తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు ప్రాధాన్యం. కేసీఆర్ ఎగవేసిన రూ.7,625 కోట్ల రైతు బంధు నిధులను మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే రైతుల ఖాతాల్లో వేశాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం.  మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు వారి ఖాతాల్లో వేసి, రూ.2 లక్షల వరకు రైతులపై ఉన్న రుణభారం నుంచి విముక్తి కల్పించాం. 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా ‘రైతులు పండించిన వడ్లను మేం కొనం, ఇది మా బాధ్యత కాదు’ అని చెప్పారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మీరు వరి పండించండి.. చివరి గింజ వరకు కొంటాం. కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లు పండిస్తే  రూ. 500 బోనస్ ఇచ్చి కొంటాం’ అని మాట ఇచ్చి అమలు చేశాం. మా మాట నమ్మి రైతులు 2 కోట్ల 80 లక్షల టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలిపారు. మా ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడమే కాకుండా వడ్ల పైసలు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో వేసింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగులు రోడ్లెక్కారు. 

కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. వాళ్లు అదానీ, అంబానీలతో పోటీపడేలా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. వారితో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయిస్తున్నాం. ఒక్క ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లు జీరో వడ్డీ రుణాలు ఇప్పించాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాళ్లతో వెయ్యి బస్సులను కొనిపించి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చాం. 8వేల ఐకేపీ కేంద్రాలను ఆడబిడ్డల చేతుల్లో పెట్టాం. గ్రామాల్లో ఉన్న పాఠశాలలను "అమ్మ ఆదర్శ పాఠశాల" కింద ఆడబిడ్డల చేతుల్లో పెట్టి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాం” అని వివరించారు.

పదేండ్లలో కృష్ణా నది మీద ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే.. 

ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిని పదేండ్లలో బీఆర్ఎస్​ప్రభుత్వం పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత- చేవెళ్ల.. ఏ ప్రాజెక్టు చూసినా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రాణహిత–-చేవెళ్ల పేరు మార్చి, అంచనాలు పెంచి లక్ష కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం మూడేండ్లకే కూలేశ్వరం అయింది. 

లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయి’’ అని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు 65 టీఎంసీల నీటి కేటాయింపులు తీసుకొచ్చిందని, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం ప్రధాని మోదీతో కొట్లాడుతున్నామని చెప్పారు. కేసీఆర్ వదిలేసిన తుమ్మిడిహెట్టిని కట్టి శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీళ్లు తెచ్చి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన, నిర్లక్ష్యం వహించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

తెలంగాణకు కేసీఆర్​ మరణశాసనం.. 

ఉమ్మడి రాష్ట్రానికి బచావత్​ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల కేటాయింపులకే ఒప్పుకుని తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్​అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఆనాడు నువ్వు (కేసీఆర్) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబునాయుడు రాయలసీమలో ముచ్చుమర్రి కట్టింది నిజం కాదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది నిజం కాదా..? నీ పాలనలోనే పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీటిని తరలించుకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నిజం కాదా..? ఆధారాలతో సహా నేను వస్తా.. చర్చకు నువ్వు రా. 

కృష్ణా నదిలో మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులకు ముఖం చెల్లక ఇప్పుడు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పండుకున్నవ్’’ అని ఫైర్ అయ్యారు. ‘‘వ్యవసాయం దండగ కాదు.. పండుగ. రైతే రాజు.. రైతుల కోసం ఎంతవరకైనా, ఎవరితోనైనా కొట్లాడతాం. తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు. రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిద్రపోతున్నారు” అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదేండ్లు తామే అధికారంలో ఉంటామని, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పారు. 

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారు..

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించినా.. లోపల కిడ్నీలు, గుండె దెబ్బతిని, రక్తం తగ్గి, బీపీ పడిపోయి  చనిపోయే ముందు ఎలా ఉంటాడో,  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అలాగే  క్యాన్సర్ బారిన పడినట్లుగా ఉంది. రూ.8.29 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్​రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. అదే సమయంలో కేసీఆర్​ఫ్యామిలీ మెంబర్లు మాత్రం ఆగర్భ శ్రీమంతులయ్యారు. 

తెలంగాణ రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈరోజు మొయినాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హరీశ్​రావుకు, జన్వాడలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎలా వచ్చాయి? ఎర్రవల్లిలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 100 ఎకరాల ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా వచ్చింది? టీవీలు, పేపర్లు ఎలా పెట్టారు? వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎలా అధిపతులయ్యారు? రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రూ. 8 లక్షల కోట్ల అప్పు ఎలా అయింది?’’ అని ప్రశ్నించారు. కేసీఆర్​కుటుంబసభ్యులు నిజాం నవాబుల కన్నా ధనవంతులుగా మారితే, ఒకప్పుడు దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న  తెలంగాణ ఈరోజు దివాలా తీసిందని దుయ్యబట్టారు.