- జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన
- ఎంవీఎస్ కాలేజీ మైదానంలో సభ
- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
హైదరాబాద్/ మహబూబ్నగర్, వెలుగు : మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద ఉన్న బాలికల సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామశివారులో ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ కోసం కేటాయించిన స్థలం వద్దకు చేరుకొని భూమిపూజ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలపై వారితో చర్చిస్తారు.
ఎంవీఎస్ మైదానంలో జనజాతర
చిట్టబోయినపల్లి నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్రెడ్డి చేరుకుంటారు. స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన పలు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జన జాతర బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ స్థలాన్ని, ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్ను శుక్రవారం మధ్యాహ్నం పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జనంపల్లి అనిరుథ్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు.
