
- నాగర్కర్నూల్ జిల్లా మాచారంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమలలో చెంచు గిరిజనుల పోడు భూములకు సౌర విద్యుత్ ద్వారా నీరందించే ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించేందుకు సోమవారం సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఆదివాసీ, చెంచు, గిరిజనుల సాగుభూమికి సాగునీటి వసతి కల్పించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్లతో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా 2.10 లక్షల గిరిజన ఫ్యామిలీలకు లబ్ది చేకూరనుంది. ఈ పథకాన్ని నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం ప్రారంభించనున్నారు. మాచారం గ్రామంలో ఎంపిక చేసిన 26 మంది చెంచుల భూముల్లో బోర్లు తవ్వించి, సోలార్ ప్యానెల్స్, మోటార్లు, పైప్లైన్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ అధికారులు పండ్ల మొక్కలు నాటారు. తోటల మధ్యలో అంతర్గతంగా ఆరుతడి పంటలు సాగుకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన ఇలా..
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉదయం 11గంటలకు మాచారం గ్రామానికి చేరుకుంటారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించిన అనంతరం సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. మాచారం గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మాచారంలో అధికారిక కార్యక్రమాల అనంతరం సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామానికి వెళ్తారు. సీఎం కుటుంబ సభ్యులు సొంత డబ్బులతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా అధికారులు మాచారం, కొండారెడ్డిపల్లిలో అన్ని ఏర్పాట్లు చేశారు.