విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రాగా వేద పండతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం జగన్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ కు వేద పండితులు అమ్మవారి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.