న్యూఢిల్లీ: సీఎన్జీ, కుకింగ్ గ్యాస్ (పీఎన్జీ) ధరలు కేజికి రూ. 3 చొప్పున దేశ రాజధానిలో శనివారం పెరిగాయి. నేచురల్ గ్యాస్ ధరలు పెరగడంతో వీటి రేట్లను కూడా కంపెనీలు పెంచాయి. గత నాలుగు నెలల్లో మొదటి సారిగా సీఎన్జీ ధరలను పెంచగా, పీఎన్జీ రేట్లను గత రెండు నెలల్లో మొదటి సారిగా పెంచారు. ఇంధ్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారం, సీఎన్జీ ధర ఢిల్లీలో కేజికి రూ. 78.61 గా పలుకుతోంది. ముందు ఈ రేటు రూ.75.61 గా ఉంది. కాగా, ఈ ఏడాది మార్చి ఏడు తర్వాత సీఎన్జీ ధరలను పెంచడం ఇది 14 వ సారి. చివరి సారిగా ఈ ఏడాది మే 21 న కేజి ధరను రూ. 2 పెంచారు. మొత్తంగా ఈ 14 సార్లలో సీఎన్జీ ధరను కేజికి రూ. 22.60 పెంచారు.
అదే కిందటేడాది ఏప్రిల్ నుంచి చూస్తే సీఎన్జీ రేట్లను కేజీపై రూ. 35.21 పెంచారు. ఇదే టైమ్లో కుకింగ్ గ్యాస్ అయిన పీఎన్జీ రేట్లు కూడా భారీగానే పెరిగాయి. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ రేటు ఈ టైమ్లో రూ. 53.59 పెరిగాయి. కాగా, ప్రభుత్వం నేచురల్ గ్యాస్ రేట్లను 40 శాతం పెంచి మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ ధరను 8.57 డాలర్లుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పెరిగిన రేట్లు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. సీఎన్జీ ధర కేజికి రూ.8–12, పీఎన్జీ రేటు స్టాండర్డ్ క్యూబిక్ మీటర్కు ఆరు రూపాయిలు దశల వారీగా పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.