
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కొత్త బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 5న ‘కోల్ బెల్ట్ ’ బంద్ చేపట్టనుంది. బుధవారం హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి కూనంనేని సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల ఉద్యమానికి మద్దతుగా సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 5 నుంచి 15 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు, నిరహార దీక్షలు, జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
కొత్త గనులు సింగరేణికి ఇవ్వాలె: వాసిరెడ్డి
సింగరేణి సంస్థ కోట్లాది రూపాయలను ఖర్చు చేసి బొగ్గు నిక్షేపాలను కనుగొంటే వాటిని ప్రభుత్వాలు వేలం వేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దుర్మార్గమని వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు. 2022లో కోయలగూడెం, సత్తుపల్లి బొగ్గు గనుల వేలంపాటలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని పాల్గొనవద్దని చెప్పి, రెండు గనులను అరవిందో, అవంతి సంస్థలు దక్కించుకునేలా కుట్ర చేశారని ఆరోపించారు.