పద్మారావునగర్, వెలుగు: పుట్టుకతోనే వినికిడి సమస్యలున్న మూడేళ్లలోపు చిన్నారులకు శాశ్వత పరిష్కారంగా గాంధీ హాస్పిటల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో రూ.15 లక్షల ఖరీదైన ఈ ట్రీట్ మెంట్ను ఆరోగ్య శ్రీ కింద గాంధీ ఈఎన్టీ విభాగంలో ఉచితంగానే చేస్తున్నట్లు డిప్యూడీ సూపరింటెండెంట్, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ. శోభన్బాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ముగ్గురు చిన్నారు
లకు విజయవంతంగా ఈ సర్జరీలు చేశామన్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సురక్షితంగా చేసే ఈ సర్జరీలతో చిన్నారులకు వినికిడి సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని, మాట్లాడగలరని పేర్కొన్నారు. మూడేండ్లలోపు చిన్నారులెవరికైనా ఇలాంటి సమస్య ఉంటే పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శోభన్బాబు కోరారు. ఈ సర్జరీ పలు దశల్లో విజయవంతంగా పూర్తిచేసేందుకు 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు.