
హైదరాబాద్, వెలుగు :ఆర్టీఏలో ఓవర్ లోడ్, ఎంట్రీ పేరుతో వసూళ్ల దందా సాగుతోంది. డ్రైవర్ల దగ్గర నుంచి అందినకాడికి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం, నియోజకవర్గానికి ఒక్కో అధికారి ఆపి, డబ్బులు తీసుకుంటున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. డబ్బులు తీసుకొని చలానాలు ఇవ్వడంలేదని, బండి పత్రాలన్నీ ఉన్నా చేతులు తడప తప్పడం లేదంటున్నారు. మరో వైపు ఓవర్లోడ్తో ప్రమాదాలు పెరగడంతోపాటు, రోడ్లన్నీ పాడవుతున్నాయి. ఆర్టీఏ ఉన్నతాధికారులు మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు.
ఆర్టీఏ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చెక్పోస్టుల్లో పనిచేస్తున్న వారి వసూళ్లకు అడ్డుఅదుపు లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓవర్లోడ్తో వెళ్తున్న ఒక్కో లారీ నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఎంట్రీ పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. దీనిపేరుతో ఒక్కో బండి నుంచి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారన్నారు. అది కూడా ఒక నియోజకవర్గం దాటగానే మరో నియోజకవర్గంలో మరో ఆఫీసర్ మళ్లీ డబ్బులు అడుగుతున్నారని వాపోతున్నారు. ఒక్కో ఆఫీసర్ తన పరిధిలో భారీగా వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్తో బండ్లు వస్తే అధికారలు చలానా రాసి జరిమానా విధించాలి. అవసరమైతే బండ్లను సీజ్ చేయాలి. లారీ టైర్లను బట్టి సరుకు లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయతే కొన్ని లారీలు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో రోడ్డెక్కుతుంటాయి. ఆయా బండ్లకు లోడ్ను బట్టి జరిమానా విధించాలి. అయితే ఇక్కడ అవేవీ పాటించడం లేదు. ఉదాహరణకు.. ఇసుక అయితే అదనపు లోడ్ టన్నుకు వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాలి. లారీల్లో అనుమతించిన దానికంటే ఐదారు టన్నులు ఎక్కువ లోడ్ తీసుకుకెళ్తుంటారు. బండి పట్టుబడినప్పుడు అధికారులు చలానాలు రాయడంలేదు. సీజ్ చేయడంలేదు. తమకు వాల్సినంత వసూలు చేసుకొని వదిలేస్తున్నారు. దీంతో రవాణా శాఖకు రోజుకు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది.
రోడ్లు ధ్వంసం.. నిత్యం ప్రమాదాలు..
ఇసుక, గ్రానైట్రాళ్లు తదితర ఓవర్ లోడ్తో లారీలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని రోడ్లన్నీ పాడవుతున్నాయి. అంతే కాకుండా ఓవర్లోడ్ వల్ల బండ్లు అదుపు తప్పడం, తదితర కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీఏ అధికారులు సక్రమంగా జరిమానాలు విధించి, ఓవర్ లోడ్ బండ్లను అడ్డుకుంటే ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
బెల్లంపల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు మోటార్సైకిల్తో సహా బావిలో పడ్డడు. అందుట్లనే 36 గంటలు బయటకు రాలేక విషసర్పాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిండు. అయినా, కిస్మత్గట్టిగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డడు. కానీ.. చావు ఎప్పుడు ఏ రూపంలో మింగేస్తదో అంతుపట్టదు. అప్పుడు బావిలో పడి, పాముల మధ్య ఉన్నా మృత్యుంజయుడిగా వచ్చిన అతడు.. శుక్రవారం సెల్ఫోన్మాట్లాడుతూ పట్టాలపై నిలుచోగా రైలు ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా తాండూర్ రైల్వేస్టేషన్లో ఈ సంఘటన జరిగింది. జమ్మికుంటకు చెందిన వరికెల రాజమొగిళి(60) పత్తి వ్యాపారం చేసేవాడు. శుక్రవారం వ్యాపార పనుల నిమిత్తం జమ్మికుంట నుంచి కాగజ్నగర్కు ఇంటర్సిటీ రైలులో వస్తున్నాడు. రేచిని రైల్వేస్టేషన్లో క్రాసింగ్ ఉండటంతో రైలు ఆగింది. తోటి ప్రయాణికులతో కలిసి రాజమొగిళి కూడా కిందికి దిగాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ పక్కన ఉన్న పట్టాల పైకి వెళ్లాడు. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్వేగంగా వచ్చి రాజమొగిళిని ఢీకొట్టింది. రెప్పపాటులో అతడు విగత జీవిగా మారిపోయాడు. రాజమొగిళికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమొగిళి గతంలో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడినా మృత్యుంజయుడిగా బయటపడ్డాడని, కానీ ఇప్పుడిలా చనిపోతాడని అనుకోలేదని ఆయన సన్నిహితులు విచారం వ్యక్తంచేశారు.