
నిర్మల్, వెలుగు: ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని నిర్మల్కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోన్ లోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, హాజరు, క్లాస్రూమ్లు, హాస్టల్, కిచెన్, టాయిలెట్లు, స్టోర్రూంను పరిశీలించి టీచర్లకు పలు సూచనలు చేసారు. విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.
అంతకుముందు కొద్దిసేపు టెన్త్ స్టూడెంట్లకు మ్యాథ్స్, ఇతర సబ్జెక్టులను కలెక్టర్ బోధించారు. విద్యార్థులతో బోర్డుపై లెక్కలు చేయించి, ప్రశ్నలు అడిగి విద్యార్థుల సమాధానాలు రాబట్టారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా కష్టపడాలని వారికి సూచించారు. కార్యక్రమంలో డీఈవో పి.రామారావు, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్, విద్యాశాఖ అధికారులు పరమేశ్వర్, సలోమి, లింబాద్రి, ప్రవీణ్, హెచ్ఎం లతాదేవి, తదితరులు పాల్గొన్నారు.