
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళీకేరి సూచించారు. కొంగరకలాన్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి నోడల్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సీజ్ అయిన క్యాష్, బంగారం, ఇతర వస్తువులను రికార్డ్లో నమోదు చేయాలని తెలిపారు. రోజువారీ నివేదికలను అందించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు.
మొబైల్ వెహికల్స్ ప్రారంభం
ఓటు హక్కుపై విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఓటింగ్ ఆవశ్యకత, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల వారీగా మొబైల్ వాహనాలను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతి హోళీకేరి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.