ఇబ్బందులు లేకుండా చూడాలి..పోలింగ్​ సెంటర్లు, చెక్​ పోస్టులను సందర్శించిన కలెక్టర్లు

ఇబ్బందులు లేకుండా చూడాలి..పోలింగ్​ సెంటర్లు, చెక్​ పోస్టులను సందర్శించిన కలెక్టర్లు

మహబూబాబాద్/నర్సంపేట/ఏటూరునాగారం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు  సమన్వంయంతో పని చేయాలని కలెక్టర్లు సూచించారు. మంగళవారం ఆయా జిల్లాలోని పలు సెంటర్ల, చెక్​పోస్టులను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్​లో ఏర్పాటు చేసిన కౌంటింగ్​ సెంటర్​ను కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబాబాద్, డోర్నకల్​ నియోజకవర్గాల కౌటింగ్ ప్రక్రియ, పోలింగ్ మెటీరియల్ స్వీకరణకు రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు, పోలింగ్ మెటీరియల్, స్ట్రాంగ్ రూమ్​కు సీసీ కెమోరాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈనెల 20లోగా  నివేధిక అందజేయాలని ఆర్వోలను ఆదేశించారు. 
    
ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించాలని వరంగల్​ కలెక్టర్​ ప్రావీణ్య సూచించారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై గల చెక్ పోస్ట్ ను కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించేలా  అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 ఫ్లైయింగ్ స్క్యా డ్స్,9 స్టాటిస్టికల్ సర్వేలెన్స్​ టీమ్ లు, 9 వీడియో వ్యువింగ్  టీమ్​లు నియమించినట్లు తెలిపారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో గల స్ట్రాంగ్ రూమ్ లను  ఈవీఎం, గోడౌన్ల వద్ద భద్రతను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి  ఓటర్ల జాబితాను పరిశీలించారు.  
    
అన్ని పోలింగ్​ కేంద్రాల్లో కనీస వసతులను త్వరగా కల్పించాలని ములుగు కలెక్టర్​ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కన్నాయిగూడెం మండలంలోని కొత్తూరు, ఏటూరు గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు.  ఓటరు జాబితాను పరిశీలించారు.