
చింతకాని, వెలుగు : - భూ భారతి ద్వారా భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మంగళవారం చింతకాని మండలం వందనం గ్రామ పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. ఎటువంటి భూ సమస్యలు అధికంగా వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా కేసులను హై కోర్టు నుంచి అనుమతి రాగానే నిబంధనల ప్రకారం కబ్జాలో ఎవరు ఉన్నారో విచారించి, అర్హుల పేరిట పట్టాలు అందిస్తామన్నారు. ప్రతీ భూ సమస్యకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. అసైన్డ్మెంట్ భూముల కొనుగోలు చేసింది పేదలు ఉంటే పట్టాలు జారీ చేస్తామని, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి సర్వే వేగవంతం చేసేందుకు ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారులు రెగ్యులర్ గా వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నారా లాంటి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, నాణ్యత కలిగిన విద్య అందుతుందని, ప్రతి స్టూడెంట్ను గవర్నమెంట్లోనే చదివించాలని పేరెంట్స్కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కే. అనంత రాజు, పంచాయతీ కార్యదర్శి కే. శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించాలి
ఆదాయ పెంపు మార్గాలను మహిళలు అన్వేషించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. చింతకాని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్త్రీ టీ స్టాల్ ను ఆయన సందర్శించారు. కొనసాగుతున్న వ్యాపారం, లాభనష్టాలను ఆరా తీశారు. స్త్రీ టీ షాప్ దగ్గర కలెక్టర్ కాఫీ తాగి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. వ్యాపారం ఎదుగుదలపై పలు సూచనలు చేశారు. సిటిజన్ సర్విసెస్ పై శిక్షణ తీసుకొని షీ రాక్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సీజన్ కు అనుగుణంగా స్నాక్స్ అందుబాటులో పెట్టి విక్రయించాలన్నారు.
మహిళా సంఘాల గ్రేడింగ్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చింతకాని మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనం నిర్మాణ పెండింగ్ పనులకు రూ.5 లక్షలు అవుతుందని కోరగా వెంటనే ఆయన చెక్ ను ఎంపీడీవోకు అందిస్తూ నెల రోజుల లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా మార్ట్ లో ఎటువంటి పదార్థాలు విక్రయించాలో జిల్లా మహిళా సమాఖ్యలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.