
సీక్వెల్ రోడ్డులోని మహిళా మార్ట్ సందర్శన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మహిళా మార్ట్ ప్రత్యేకత చాటే విధంగా మార్ట్ నిర్వహణకు మహిళా సంఘాలు బాధ్యత వహించాలని, ఎప్పుడూ లాభాల బాటలో నడిపించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. ఖమ్మంలో వైరా రోడ్ కు ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ ను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వీ పాటిల్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్దత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. మహిళామార్ట్ ఏర్పాటుకు దోహదపడిన పలు అంశాలు, మార్ట్ ఉద్దేశ్యం, విక్రయించే ఉత్పత్తులు, ఖమ్మం బ్రాండింగ్ విలువ పెంచేందుకు తీసుకున్న చర్యలను కలెక్టర్ వివరించారు. పలు ఉత్పత్తులను అధికారులు మార్ట్లో కొనుగోలు చేశారు.
ఖమ్మం మహిళా మార్ట్ బాగుందని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళలు అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. వాటిని విక్రయించే వేదికగా మహిళామార్ట్ను ఏర్పాటు చేశామని, సమీకృత మార్కెట్లో కూడా ఓ స్టాల్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. వీటితోపాటు ఆన్లైన్లో కూడా మహిళా ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ మాట్లాడుతూ మహిళా ఉత్పత్తుల విక్రయానికి మంచి కేంద్రాన్ని మార్ట్ రూపంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం మహిళా మార్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీ స్టాల్ ను పరిశీలించి అక్కడ టీని రుచి చూశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.