
కొత్తపల్లి/కరీంనగర్ టౌన్, వెలుగు: మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని అంధకారం చేసుకోవొద్దని యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి పట్టణంలోని కరీంనగర్ ప్రభుత్వ వైద్య కాలేజీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం నిర్వహించారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ మీదుగా పరేడ్ గ్రౌండ్ వరకు చేపట్టిన 2కే ర్యాలీని సీపీ గౌస్ ఆలంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య, ఇంజినీరింగ్ చదువుతున్న కొందరు విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడడం బాధాకరమన్నారు. అనంతరం డ్రగ్స్ నిరోధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసి పోస్టర్ ను ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పర్వీన్, ఏడీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీసీఆర్బీ సీపీ విజయ్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు
నిషేధిత జాబితాలోని సర్వే నంబర్లలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే బాధ్యులపైన, అధికారులపైన కేసులు నమోదు చేయిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలు అనుసరించి రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్ నుంచి పంపించిన జాబితా క్రోడీకరించి సమగ్ర జాబితా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం బల్దియా ఆవరణలోని కళాభారతిలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ సువార్త, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.