రామచంద్రాపురం, వెలుగు: అధికారులంతా సమన్వయంతో పనిచేసి సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ను సక్సెస్చేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. రామచంద్రాపురం మండలం కొల్లూర్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించే ఎస్ఐఎస్ఎఫ్2026 ఏర్పాట్లను శుక్రవారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ జిల్లా ప్రతిష్టకు కీలకమైందని అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.
సౌత్ ఇండియా నలుమూలల నుంచి విద్యార్ధులు, ఉపాధ్యాయులు, గెస్టులు హాజరుకానున్నారని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంట్రన్స్, ఎగ్జిట్ మార్గాలు, ఎగ్జిబిట్ల లిస్టు, విద్యుత్ కనెక్షన్లు, భద్రతా ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఫెయిర్లో పాల్గొనే వారికి వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాల విషయంలో కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అన్ని అంశాల్లో బ్యాక్ అప్ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశీలనలో ఆర్డీఓ రాజేందర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి, నోడల్ ఆఫీసర్ లింబాజీ, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
