డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి : ప్రియాంక అల

డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండల తీవ్రత నేపథ్యంలో డాక్టర్లు హాస్పిటళ్లలో 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్​లో మంగళవారం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టాస్క్​ ఫోర్స్​ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప డాక్టర్లకు సెలవులు ఇవ్వొద్దన్నారు. వడదెబ్బకు సంబంధించిన మరణాల నమోదు, విచారణకు మండల మెడికల్​ ఆఫీసర్, తహసీల్దార్, ఎస్సైలతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీ  రోజూ నివేదికలను అందజేస్తుందని తెలిపారు.

ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఉపాధి హామీ కూలీల పనివేళలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మందులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఫ్రూట్​ జ్యూస్​ కేంద్రాల వద్ద ఉపయోగించే ఐస్​ నాణ్యతను పరిశీలించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్​డీఓ విద్యాచందన, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ కృష్ణ గౌడ్​, డీఎంహెచ్​వో డాక్టర్​ శిరీష, మెడికల్​ కాలేజ్​ ప్రిన్సిపాల్​ లక్ష్మణరావు, పంచయతీ ఆఫీసర్​ చంద్రమౌళి, డీఏవో వెంకటేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

శిక్షణ తరగతుల పరిశీలన.. 

పాల్వంచ రూరల్​ :  పాల్వంచ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భధ్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్​ ప్రింయాంక అల మంగళవారం పరిశీలించారు. శిక్షణ తరగతులలో ఈవీఎం పరికరాల పనితీరును పీవో, ఏపీవోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్​ సమయంలో ఇబ్బందులకు గురికాకుండా అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. శిక్షణా తరగతులకు మొత్తం1,233 మందికి గాను 48 మంది గైర్హాజరయ్యారని, హాజరుకానివారికి షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.