10 నెలలుగా జీతాలు ఆపడం దారుణం

10 నెలలుగా జీతాలు ఆపడం దారుణం
  • కాలేజీ హాస్టళ్లలోని వర్కర్లకు వెంటనే జీతాలివ్వాలి 
  • హాస్టల్స్​ పరిపాలనా విధానంలో మార్పులు తేవాలి
  • బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్​

ముషీరాబాద్/ మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజీలు, హాస్టళ్లలో పనిచేసే వర్కర్లకు 10 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. హాస్టల్స్​పాలన విధానంలో ప్రభుత్వ మార్పులు చేసి వర్కర్లకు వెంటనే నెల నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

శుక్రవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. హాజరైన వర్కర్లను ఉద్దేశించి కృష్ణయ్య మాట్లాడారు. అడ్డా కూలీలకు, రైతు కూలీలకు రోజుకు రూ.700 నుంచి రూ.1000 రూపాయలు ఇస్తుంటే.. హాస్టల్లో పనిచేసే వర్కర్లకు మాత్రం కేవలం 450 ఇవ్వడం దారుణమన్నారు. 300 మంది స్టూడెంట్లు ఉండే హాస్టళ్లలో ముగ్గురు వర్కర్లతో నెట్టుకురావడం ఎంతవరకు కరెక్ట్​అన్నారు.

 వర్కర్ల సంఖ్యను పెంచి హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వర్కర్ల జీతాన్ని రూ.25,000కు పెంచాలని కోరారు. లేని పక్షంలో వర్కర్లతో కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. అనంతరం మాసబ్ ట్యాంక్ లోని బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. బీసీ నేతలు అంజి, నీల వెంకటేశ్, రాజేందర్, మల్లేశ్​యాదవ్, ప్రభాకర్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.