
- ఎకరం స్థలం ఇవ్వాలని జీఓ ఇచ్చిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్
- రూ.240 కోట్ల స్థలాన్ని రూ.4.84 లక్షలకే కట్టబెట్టిన ఆఫీసర్లు
- తతంగం నడిపించిన తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
- పుల్లయ్యకుంట చెరువును సైతం పూడ్చిన బీఆర్ఎస్ లీడర్లు
- ముఖ్య అతిథిగా హాజరై పనులకు కేటీఆర్ శంకుస్థాపన
- 10 నెలల తర్వాత ఆఫీస్ బదులు షాపులు
వరంగల్/ఖిల్లా వరంగల్, వెలుగు : వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్థలంలో కబ్జాదారులు పడ్డారు. జిల్లాలో ప్రధాన కార్యాలయం కడతామంటూ అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. ఖమ్మం హైవే రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. అధికారం ఉండడంతో అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్.. బీఆర్ఎస్ నేతలకు ఎకరం స్థలం ఇవ్వాలని జీఓ 48, 167, 158 నంబర్లతో ఆదేశాలు ఇచ్చారు. దీంతో వరంగల్ జిల్లా కలెక్టర్ బి.గోపి ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ పేరుతో లోకల్ ఎమ్మెల్యే నరేందర్కు కేటాయించారు. నిరుడు మే 11న దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ భూమి అప్పజెప్పారు. అదే నెల 20న మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కానీ పది నెలలైనా ఆఫీసు కట్టలేదు.
గజం రూ.50 వేలుంటే.. రూ.100కు ఇచ్చిన్రు
అది వరంగల్– ఖమ్మం హైవే రోడ్. ఫేమస్ జంక్షన్గా చెప్పుకునే నాయుడు పెట్రోల్ పంప్ సర్కిల్. ఉర్సు విలేజీ పరిధిలో సిటీ చుట్టూ ఉండే రింగ్రోడ్ కలిసే కమర్షియల్ సెంటర్ పాయింట్. రోడ్డును ఆనుకుని ఎక్కడ చూసినా తక్కువలో తక్కువ గజం ధర రూ.50 వేలు పైమాటే. కానీ, సర్వే నంబర్ 140లో అధికారులు రూ.100 గజం చొప్పున బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ పేరు నోట్ చేస్తూ ఎకరం స్థలాన్ని కట్టబెట్టారు. ఈ లెక్కన రూ.240 కోట్ల విలువ చేసే 4,840 గజాల స్థలాన్ని కేవలం రూ.4 లక్షల 84 వేలకు అప్పనంగా రాసిచ్చారు. అంతేకాకుండా స్థలం చాలట్లేదనే పేరుతో బీఆర్ఎస్ లీడర్లు రాత్రికిరాత్రే పక్కనే ఉన్న పుల్లయ్యకుంట చెరువు స్థలాన్ని కూడా కబ్జా చేసి మొరంతో నింపేశారు.
ఆఫీస్ కట్టలే.. కమర్షియల్ షట్టర్లొచ్చినయ్
వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వ్యవహరిస్తున్నారు. కాగా, పార్టీ కార్యాలయం తన నియోజకవర్గంలో ఉండేలా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముందుండి తతంగం నడిపించారు. నిరుడు మే నెలలో దీనికి సంబంధించిన భూమిపూజ చేసినా ఇప్పటి వరకు ఆ స్థలంలో ఆఫీసు కట్టలేదు. కానీ ఇదే స్థలంలో రెండు కమర్షియల్ షాపులు నిర్మించారు. దానికి టులెట్ బోర్డు పెట్టారు. ఈ షాపులు ఎవరు కట్టారో తెలియదు. అయితే పార్టీ పేరుతో తీసుకున్న స్థలంలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇష్యూపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
బీఆర్ఎస్ ఆఫీస్ పేరుతో తీసుకున్న స్థలంలో పార్టీ కార్యాలయం కాకుండా ప్రైవేట్ నిర్మాణాలు ఉండడంపై స్థానికులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, తాము ఉన్నాతాధికారుల ఆదేశానుసారం బీఆర్ఎస్ నేతలకు స్థలం అప్పజెప్పాము తప్ప అందులో జరిగిన నిర్మాణాలతో సంబంధం లేదని ఆఫీసర్లు చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక సోషల్ యాక్టివిస్ట్ ఎండీ ఫసి.. చెరువుల పరిరక్షణ కమిటీ మెంబర్ పెరుమాళ్ల లక్ష్మణ్, మరికొందరితో కలిసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైతం బుధవారం విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్థల వివాదంపై పూర్తి ఎంక్వరీ చేయాలే
వరంగల్ సిటీలో వందల కోట్ల విలువ చేసే ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ధరకు ఎలా కేటాయించారో అర్థం కావట్లేదు. కబ్జాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే ఆఫీసు పేరుతో ఏకంగా పుల్లయ్య చెరువును మొరంతో కబ్జా చేశారు. మంత్రి కేటీఆర్ దీనికి భూమిపూజ చేశారు. తీరా చూస్తే ఆ స్థలంలో ఆఫీసు కాకుండా కమర్షియల్ షాపులు కట్టారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవడంపై అధికారులు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయాలే.
- ఎండీ ఫసి, పి.లక్ష్మణ్