పోలీసులపై గవర్నర్​కు బీజేపీ నేతల కంప్లైంట్​

పోలీసులపై గవర్నర్​కు బీజేపీ నేతల కంప్లైంట్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోలీసుల తీరుపై బీజేపీ నేతలు గవర్నర్​తమిళిసైకి ఫిర్యాదు చేశారు. బుధవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్​హౌస్​లో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ నేతలతోపాటు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నేతలు ముందస్తుగానే గవర్నర్​సిబ్బంది నుంచి పర్మిషన్​ తీసుకున్నారు. పర్మిషన్​లేదంటూ పోలీసులు ఇబ్బంది పెట్టారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు హతీరామ్​పవార్​ఆవేదన వ్యక్తం చేశారు. ఏజేన్సీ ఏరియాల్లో టీచర్లు, ఉద్యోగుల సమస్యలతోపాటు రిజర్వేషన్లపై వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే లోపలికి రానివ్వలేదని వాపోయారు.

గవర్నర్​తో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు

ఖమ్మం టౌన్: రాష్ట్ర గవర్నర్ తమిళిసైను నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఖమ్మం శాఖ నూతన కార్యవర్గం చైర్మన్ డాక్టర్. వి.చంద్రమోహన్, వైస్ చైర్మన్ ఆర్.రవీందర్ రావు, సెక్రటరీ బి. వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఎ. గోవర్ధన రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు కలిశారు. సొసైటీ కార్యకలాపాలను అధ్యక్ష హోదాలో కలెక్టర్ గౌతమ్​ వివరించారు.సేవా కార్యక్రమాల్లో సొసైటీ ముందుందని తెలిపారు. 

గవర్నర్​ను కలిసిన బీజేపీ నేతలు

ఖమ్మం కార్పొరేషన్: రాష్ర్ట గవర్నర్​తమిళిసై సౌందర్యరాజన్​ను నగరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ నేతృత్వంలో పార్టీ లీడర్లు కలిశారు. పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ తరుగు పేరుతో 10 కేజీల వరకు కోత విధిస్తూ మోసం చేస్తున్నారని, అధికార పార్టీ లీడర్ల అండదండలతోనే ఇదంతా సాగుతోందన్నారు. రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి నరేందర్ రావు, నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్యాంరాథోడ్, రుద్ర ప్రదీప్, నున్నా రవికుమార్, మందా సరస్వతి, విజయ, రాజేశ్​గుప్తా, చావా కిరణ్, ఉపేందర్​గౌడ్, అల్లిక అంజయ్య, వెంకట్, శ్యామ్, సతీశ్​ఉన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి...

సత్తుపల్లి: సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ ల కారణంగా దెబ్బతిన్న ఇండ్ల బాధితులకు పరిహారం ఇవ్వడంలో సంస్థ నిర్లక్ష్యం చేస్తోందని గవర్నర్ తమిళిసై కి బీజేపీ జిల్లా లీడర్లు ఫిర్యాదు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో కలిసిన పలువురు కలిసి వినతిపత్రం అందజేశారు.