- చర్యలు తీస్కోవాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి బీజేపీ నేతల విజ్ఞప్తి
- భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విషం చిమ్ముతున్నయని ఆరోపణ
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్లను వక్రీకరిస్తూ ప్రజలను టీ న్యూస్ చానెల్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తప్పుదారి పట్టించాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ నేతృత్వంలోని పార్టీ నేతలు.. బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీని కోరారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్ 11లోని ప్రహ్లాద్ జోషి ఇంట్లో సమావేశం అయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఆ వార్తా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రికి వివరించారు. టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే ఆ వార్తా సంస్థలు నడుస్తున్నాయని, ఆ పార్టీ ఆఫీస్లోనే టీ న్యూస్ చానెల్ ఉందని పేర్కొన్నారు. మంత్రితో భేటీ అయిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కేంద్ర జలవనరుల సంఘం సలహాదారు వెదిరె శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
ఆ మూడు వార్తా సంస్థలు.. కేసీఆర్ దోపిడీ, అవినీతికి రక్షణ కవచాలు: సంజయ్
బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడేలా టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలు తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతూ అబద్ధపు కథనాలు రాస్తున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీకి ముందు ఆయన తరుణ్చుగ్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రధాని మోడీ కృషి చేస్తుంటే.. ఆ వ్యాఖ్యలను వక్రీకరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొనసాగిస్తున్న దోపిడీకి, అవినీతికి రక్షణ కవచాల్లా ఆ మూడు వార్తా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏడేండ్లలో టీ న్యూస్ చానెల్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు ప్రకటనల ద్వారా వందల కోట్ల రూపాయలను తెలంగాణ సర్కారు కేటాయించిందని ఆరోపించారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ప్రభుత్వ ఖజనాకు గండి కొడుతున్నారని మండిపడ్డారు.
అర్వింద్ ఫిర్యాదుపై లోక్సభ సెక్రటేరియట్ నోటీసులు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పేపర్ల ఎడిటర్లకు లోక్సభ సెక్రటేరియట్ (ప్రివిలేజ్ అండ్ ఎథిక్స్ బ్రాంచ్) నోటీసులు ఇచ్చింది. ‘ప్రత్యేక హక్కు ఉల్లంఘన, సభ ధిక్కరణ’ కింద ఎంపీ అర్వింద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లోక్సభ డిప్యూటీ సెక్రటరీ జి. బాలగురు మంగళవారం పత్రికలకు నోటీసులను పంపారు. నోటీసులు అందిన 72 గంటల్లోపు (ఈ నెల 25) లోపు లోక్సభ స్పీకర్ ముందు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే ఆ పత్రికల ఎడిటర్ల మీద చట్టపరంగా చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు.