హైదరాబాద్ అంబర్ పేట్ పోలీస్ గ్రౌండ్స్లో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డిజిటర్ మీటర్ ద్వారా తమ హైట్ను తక్కువ చేసి చూపించి డిస్ క్వాలిఫై చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రీ మెజర్మెంట్స్ కోసం అభ్యర్థులను.. సెలక్షన్ కమిటీ అంబర్ పేట్ పోలీస్ గ్రౌండ్స్కు పిలిపించింది. అయితే.. గతంలో వచ్చిన హైట్ కంటే రీ మేజర్మెంట్లో తక్కువ వచ్చిందంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మ్యాన్యువల్గా హైట్ చెక్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా డిజిటల్ మీటర్ తో చెక్ చేసి డిస్ క్వాలిఫై చేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డారు. తమను మెయిన్స్ కు క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తమను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన హైట్ ఎప్పుడు ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు.