ఏపీ అసెంబ్లీ సమావేశాలు:  పీపీఏలపై సభలో రగడ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు:  పీపీఏలపై సభలో రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని  స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన పీపీఏలపై సభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం  జరిగింది.

ప్రభుత్వ తీరుతో రాష్ట్రం విద్యుత్ సమస్యతో అల్లాడుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. పీపీఏలపై గత 6 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు. పీపీఏలపై కమిటీ వేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు. పీపీఏల సమీక్షతో దేశానికి నష్టమని కేంద్రం చెబుతోందన్నారు. పీపీఏల్లో చంద్రబాబు దోచుకున్నారని విమర్శించడం సబబేనా? అంటూ ప్రశ్నించారు.

ఈ పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని.. పీపీఏల కోసం అర్ధరాత్రి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలు సమర్థించాలా? అని ప్రశ్నించారు. బాబు హయాంలో డిస్కంలకు రూ. 2 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. పీపీఏల్లో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని కేంద్రం రాసిన లేఖలో ఉందని తెలిపారు. అన్నిటినీ పరిశీలించి సరైన సమయంలో ప్రభుత్వం నివేదిక ఇస్తుందని చెప్పారు మంత్రి బుగ్గన.