పార్లమెంట్​ తర్వాతే సీడబ్ల్యూసీ

పార్లమెంట్​ తర్వాతే సీడబ్ల్యూసీ

కాంగ్రెస్​ కొత్త చీఫ్​ ఎన్నిక కూడా అప్పుడే

న్యూఢిల్లీ: మూడు నెలల సాగదీతకు ముగింపు పలుకుతూ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ కాంగ్రెస్​ పార్టీ క్లారిటీ ఇచ్చింది. మొదట ఈవారంలోనే భేటీ ఉంటుందనే సంకేతాలిచ్చినా,  ప్రస్తుత పార్లమెంట్​ సమావేశాలు ముగిసిన తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా చెప్పారు.

గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్​లో పార్టీ నేషనల్​ జనరల్​ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇన్​చార్జిలు సమావేశమై సీడబ్ల్యూసీ, రాజీవ్​ గాంధీ 75వ జయంతి వేడుకల ఏర్పాట్లపై చర్చ జరిపారు. మీటింగ్​ తర్వాత సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ భేటీకి సంబంధించి తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పార్లమెంట్​ సెషన్​ తర్వాతే సీడబ్ల్యూసీ నిర్వహించాలన్న కేసీ వేణుగోపాల్​ ప్రతిపాదనను అందరూ సమర్థించారని మరో సీనియర్​ నేత పీఎల్​ పునియా చెప్పారు.

జనరల్​ సెక్రటరీ హోదాలో ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ చీఫ్​ బాధ్యతల్ని ప్రియాంకే తీసుకోవాలంటూ జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి ఆర్​పీఎన్​ సింగ్ కోరగా, అందుకామె సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ప్రస్తుత పార్లమెంట్​ సమావేశాలు ఈ నెల 7 తో ముగియనున్నాయి. లోక్​సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్​ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయనకు మద్దతుగా ఏఐసీసీ నుంచి డీసీసీ దాకా పలువురు ఆఫీస్​ బేరర్లు రాజీనామా చేశారు. సీడబ్ల్యూసీ భేటీతో కాంగ్రెస్​ చీఫ్​ ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

రాజీవ్​ గాంధీ 75వ జయంతి వేడుకలు

కాంగ్రెస్​ పార్టీకి సంబంధించి ఈ ఏడాది విశేషమైందని, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలతోపాటు మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించినట్లు సుర్జేవాలా చెప్పారు. ఆగస్టు 20న రాజీవ్​ జయంతి సందర్భంగా ఢిల్లీలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని, అంతకంటే ముందు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రాజీవ్​ను స్మరించుకుంటూ ఆయా ప్రాంతాల బాధ్యులు కార్యక్రమాల్ని చేపడతారని తెలిపారు.