నల్గొండ కాంగ్రెస్​లో ఫ్యామిలీ ప్యాకేజీ

నల్గొండ కాంగ్రెస్​లో  ఫ్యామిలీ ప్యాకేజీ
  • నల్గొండ కాంగ్రెస్​లో  ఫ్యామిలీ ప్యాకేజీ
  • కొన్నేండ్ల నుంచి ఒకే కుటుంబానికి చెందిన లీడర్లకు టికెట్లు
  • కోదాడ, హుజూర్​నగర్​లో ఎంపీ  ఉత్తమ్​ దంపతులు
  • నల్గొండ, మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్​
  • తాజాగా నాగార్జునసాగర్​లో జానా వారసుడు జయవీర్​ రెడ్డి

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్​లో ‘ఫ్యామిలీ ప్యాకేజీ’ రాజకీయాలపైన జోరుగా చర్చ జరుగుతున్నది. గత కొన్నేండ్ల నుంచి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వరుస ఎన్నికల్లో సీట్లు లభించడం ఆసక్తికరంగా మారింది. ఈసారి కొత్తగా ఇంకొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్​లో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఒక్కరే ఉన్నారని భావిస్తున్న తరుణంలో మళ్లీ ఆయన తమ్ముడు రాజగో పాల్​ రెడ్డి సొంతగూటికి చేరారు. అలాగే, జానారెడ్డికి బదులు ఆయన రెండో కొడుకు జయవీర్​ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. 

మొత్తంగా 12 అసెంబ్లీ స్థానాల్లో ఐదు కుటుంబాలకు చెందిన లీడర్లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మునుగోడులో ఆయన తమ్ముడు రాజగోపాల్​ రెడ్డి, హుజూర్​నగర్​లో ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోదాడలో ఆ యన భార్య పద్మావతి, నాగార్జునసాగర్​లో జానారెడ్డి కొడుకు జయవీర్​ రెడ్డి బరిలో ఉన్నాయి. వీరు ఐదు నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తున్నా.. మిగిలిన ఏడు నియోజకవర్గాల పైన వాళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి జోక్యం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో సీనియర్లు సక్సెస్ అయ్యారు. సూర్యాపేట, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రేవంత్​ అనుచరులకు టికెట్లు వస్తాయని భావించారు. కానీ, మునుగోడుపై కృష్ణారెడ్డి పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సూర్యాపేట, తుంగుతుర్తి టికెట్లపై ఇంకా పంచాయితీ నడుస్తున్నది. ఎంపీలు ఉత్తమ్,​ వెంకటరెడ్డి అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు వారు ప్రతిపాదించిన వారికే టికెట్లు లభించాయి. బ్యాలెన్స్​ మూడు స్థానాల్లోనూ ఎంపీలదే పైచేయిగా నిలిచే చాన్స్​ ఉంది. 

ఉమ్మడి జిల్లా పైన బ్రదర్స్​ బ్రాండ్..

ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్​ పేరు చెబితేనే పార్టీ కేడర్​లో జోష్​ కనిపిస్తుంది. 2009 నుంచి వరుసగా 3 ఎన్నికల్లో బ్రదర్స్​ కలిసే పోటీ చేశారు. ఇప్పుడు జరుగుతున్నది నాలుగో ఎన్నిక. 2018 ఎన్నికల తరహాలోనే బ్రదర్స్​ ఈసారి కూడా పక్కపక్క సెగ్మెంట్లలోనే తలపడుతున్నారు. నల్గొండలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్​ విజయం అందుకున్న వెంకటరెడ్డి ఫస్ట్​టైం 2018లో ఓడిపోయారు.

 మరుసటి ఏడాది జరిగిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలుపొందారు. రాజగోపాల్​ రెడ్డి ఫస్ట్​టైం 2009లో భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2014లో అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ లోకల్​ బాడీ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మునుగోడు నుంచి పోటీ చేసే చాన్స్ రావడంతో ఎమ్మెల్సీ పదవికి రిజైన్​ చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

గతేడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు సొంతగూటికి చేరుకున్న ఆయన ఎ మ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్​ నియోజకవర్గాల పైన బ్రదర్స్​ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలోనూ బ్రదర్స్​ సూచించిన వ్యక్తులకే అధిష్టానం టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ దాదాపు అదేరకమైన వాతావరణం కనిపించింది. 

సాగర్​ ఎడమకాల్వ ఆయకట్టులో ఉత్తమ్​ దంపతుల హవా..

నాగార్జునసాగర్​ ఎడమకాల్వ ఆయకట్టు ఏరియాలో ఉత్తమ్​ దంపతుల రాజకీయ హవా నడుస్తుంది. 1999 నుంచి 2004 వరకు రెండుసార్లు కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్..​ 2009లో హుజూర్​నగర్​ షిఫ్ట్ అయ్యారు. 2009 నుంచి 2018 వరకు 3సార్లు హుజూర్​నగర్​ నుంచి గెలుపొందారు. 2019లో ఎంపీగా పోటీ చేయాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రిజైన్​ చేశారు.

 ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కలిసొచ్చి పీసీసీ ప్రెసిడెంట్​ అయ్యే చాన్స్​ దక్కింది. ఆయన భార్య పద్మావతి తొలిసారిగా 2014లో కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓడిపోయిన ఆమె.. 2019లో హుజూర్​నగర్​ బైపోల్​లో భర్త ప్లేస్​లో పద్మావతి రెండోసారి పోటీకి దిగినా ఫలితం దక్కలేదు. మళ్లీ అవే ని యోజకవర్గాల నుంచి భార్యాభర్తలిద్దరూ పోటీలో నిలవడం గమనార్హం. ఎంపీగా ఉత్తమ్​ ప్రభావం భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల పైన బలంగా కనిపిస్తుంది.

జానారెడ్డి కొడుకు ఎంట్రీతో మారిన సాగర్​ స్వరూపం..

రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎక్కువ శాఖల మంత్రిగా రికార్డు సృష్టించిన కుందూరు జానారెడ్డి తన కొడుకును రాజకీయ అరంగ్రేటం చేయించారు. తాను ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్​ నుంచి జయవీర్​ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు జానా ప్రకటించారు. అతడి గెలుపుకోసం ఒకప్పటి కాంగ్రెస్​ సీనియర్​ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ కేడర్​లో ఉత్తేజం కలిగించేందుకు జానారెడ్డి ఎంపీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. 

ఇదిలావుంటే ఉమ్మడి జిల్లాలో 40 ఏండ్ల లోపు వయసు కలిగిన యువకులు పోటీ పడుతున్న ఏకైక నియోజకవర్గం నాగార్జునసాగర్. ఎమ్మెల్యే భగత్​ నోముల నర్సింహయ్య కొడుకుగా బరిలో దిగితే, జయవీర్​ జానారెడ్డి వారసుడిగా సాగర్​లో ఫస్ట్​టైం అడుగు పెట్టారు. ఈ ఇద్దరిలో సాగర్​ ప్రజలు ఎవరికి పట్టం కడ్తారన్నది ఆసక్తికరంగా మారింది.