వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా ఆదివారం కాంగ్రెస్ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. సిద్దిపేటలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించి మాట్లాడారు.
చేర్యాల పట్టణంలో దాసరి శ్రీకాంత్, మద్దూరు మండల కేంద్రంలో మేక మల్లేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్ఆవిర్భావ సంబరాలు జరిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద బొల్లారం మున్సిపల్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు.
సంగారెడ్డి జిల్లాలో నిరసన ర్యాలీలు
సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకాలు చేపట్టారు. జోగిపేటలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాకూరి వెంకటేశం ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయికోడ్ లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పార్టీ ఆఫీసు నుంచి ప్రధాన కూడలి వరకు గాంధీ ఫొటోలను పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహం ముందు చొక్కాలు విప్పి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
