
- అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ
- ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా రాజనర్సింహ
- మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్బాబు
- చార్జ్షీట్ కమిటీ చైర్మన్గా సంపత్ కుమార్
- ట్రైనింగ్ కమిటీకి పొన్నం.. పబ్లిసిటీ కమిటీకి చైర్మన్లుగా షబ్బీర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. ఈసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే సభలు, సమావేశాలతో జనంలోకి వెళ్తున్నది. ఇదే క్రమంలో శనివారం ఒకేసారి 8 కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, పబ్లిసిటీ కమిటీ, చార్జ్షీట్ కమిటీ, కమ్యూనికేషన్స్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ, స్ట్రాటజీ కమిటీలనపు నియమించారు.
చార్జ్షీట్ కమిటీ:
అధికార పార్టీ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చార్జ్షీట్లను వేస్తున్నది. వాస్తవానికి గతంలోనే వివిధ శాఖల వైఫల్యాలపై నాలుగైదు చార్జిషీట్లను రిలీజ్ చేసింది. తాజాగా ప్రజాకోర్టుల్లో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేపై ఆయా నియోజకవర్గాల్లో చార్జిషీట్లను రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ఈ కమిటీకి చైర్మన్గా ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్గా రాములు నాయక్ ఉంటారు. సిరిసిల్ల రాజయ్య, కోదండ రెడ్డి, బెల్లయ్య నాయక్ సహా మరో 12 మందిని సభ్యులుగా ఏఐసీసీ నియమించింది. ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పార్టీ అధికార ప్రతినిధులు, పీసీసీ నేతలు ఉంటారు.
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ:
జాతీయ నాయకత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత ఈ కమిటీదే. ఇంతకుముందు ఈ కమిటీకి చైర్మన్గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండేవారు. ఆయన పార్టీ మారడంతో తాజాగా బలరాం నాయక్ను ఈ కమిటీకి చైర్మన్గా నియమించారు. పద్మావతి రెడ్డి సహా 9 మంది సభ్యులుగా ఉంటారు.
పబ్లిసిటీ కమిటీ:
కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం కల్పించే పనిని ఈ కమిటీ చూసుకుంటుంది. సభలు, సమావేశాలు, పార్టీ పథకాలపై మీడియా, సోషల్ మీడియా లేదా నేరుగానైనా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీకి షబ్బీర్ అలీని చైర్మన్గా నియమించారు. వైస్ చైర్మన్గా ఈ. అనిల్ కుమార్ను నియమించారు. గడ్డం వినోద్, సురేశ్ షెట్కార్, కుమార్ రావు, సంగిశెట్టి జగదీశ్ సహా పది మంది సభ్యులుగా ఉంటారు.
కమ్యూనికేషన్స్ కమిటీ:
పార్టీ నేతలతో కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి నేతలు, కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకునే బాధ్యత ఈ కమిటీదే. కమిటీకి జెట్టి కుసుమ కుమార్ను చైర్మన్గా, మదన్ మోహన్రావును వైస్ చైర్మన్గా నియమించారు. ఇంకో ఏడుగురిని సభ్యులుగా అపాయింట్ చేశారు.
ట్రైనింగ్ కమిటీ:
పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు సహా అందరికీ వివిధ విభాగాలు, అంశాలపై శిక్షణనిచ్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. బూత్ లెవెల్లో ఓటర్ లిస్టుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల ప్రచార తీరు తదితర అంశాలపై శిక్షణను ఇస్తుంది. ఈ కమిటీకి చైర్మన్గా పొన్నం ప్రభాకర్ను ఏఐసీసీ నియమించింది. కన్వీనర్గా పవన్ మల్లాదికి బాధ్యతలు అప్పగించింది. జి. నిరంజన్, కోటా నీలిమ సహా 15 మందిని సభ్యులుగా అపాయింట్ చేసింది.
స్ట్రాటజీ కమిటీ:
ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలను రెడీ చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. దీనికి చైర్మన్గా ప్రేమ్సాగర్రావు వ్యవహరిస్తారు. 12 మందిని సభ్యులుగా ఏఐసీసీ నియమించింది.
మేనిఫెస్టో కమిటీ:
ప్రజలను ఆకర్షించే పథకాల రూపకల్పన, వాటి కూర్పు సహా వాటిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును చైర్మన్గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా గడ్డం ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, చిన్నారెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డి, సంభాని చంద్రశేఖర్ సహా 22 మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు, ఐఎన్టీయూసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల చైర్పర్సన్లు ఉంటారు.
ఎన్నికల నిర్వహణ కమిటీ:
ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అన్ని కమిటీల్లో ఈ కమిటీనే కీలకంగా వ్యవహరించనుంది. ప్రచారం, మేనిఫెస్టో దగ్గర్నుంచి ఎన్నికల సరళి వరకు ఈ కమిటీనే చూసుకోనుంది. ఈ కమిటీకి చైర్మన్గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను ఏఐసీసీ నియమించింది. వంశీచంద్ రెడ్డి, కొమ్రయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్, జగన్లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భరత్ చవాన్, ఫక్రుద్దీన్సభ్యులుగా ఉంటారు.