తెలంగాణ ఎన్నికల పోరు కోసం.. కాంగ్రెస్​లో 8 కమిటీలు

తెలంగాణ  ఎన్నికల పోరు కోసం..  కాంగ్రెస్​లో 8 కమిటీలు
  • అసెంబ్లీ  ఎన్నికల కోసం కాంగ్రెస్​ పార్టీ 
  • ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​గా రాజనర్సింహ
  • మేనిఫెస్టో కమిటీ చైర్మన్​గా శ్రీధర్​బాబు
  • చార్జ్​షీట్​ కమిటీ చైర్మన్​గా సంపత్​ కుమార్​
  • ట్రైనింగ్​ కమిటీకి పొన్నం.. పబ్లిసిటీ కమిటీకి చైర్మన్లుగా షబ్బీర్​

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ  ఎన్నికల కోసం కాంగ్రెస్​ పార్టీ ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. ఈసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే సభలు, సమావేశాలతో జనంలోకి వెళ్తున్నది. ఇదే క్రమంలో  శనివారం ఒకేసారి 8 కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, పబ్లిసిటీ కమిటీ, చార్జ్​షీట్​ కమిటీ, కమ్యూనికేషన్స్​ కమిటీ, ట్రైనింగ్​ కమిటీ, స్ట్రాటజీ కమిటీలనపు నియమించారు. 

చార్జ్​షీట్​ కమిటీ: 

అధికార పార్టీ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ పార్టీ చార్జ్​షీట్లను వేస్తున్నది. వాస్తవానికి గతంలోనే వివిధ శాఖల వైఫల్యాలపై నాలుగైదు చార్జిషీట్లను రిలీజ్​ చేసింది. తాజాగా ప్రజాకోర్టుల్లో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేపై ఆయా నియోజకవర్గాల్లో చార్జిషీట్లను రిలీజ్​ చేసేందుకు కాంగ్రెస్​ కసరత్తు చేస్తున్నది. ఈ కమిటీకి చైర్మన్​గా ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్​ వ్యవహరించనున్నారు. వైస్​ చైర్మన్​గా రాములు నాయక్​ ఉంటారు. సిరిసిల్ల రాజయ్య, కోదండ రెడ్డి, బెల్లయ్య నాయక్​ సహా మరో 12 మందిని సభ్యులుగా ఏఐసీసీ నియమించింది. ఈ కమిటీలో ఎక్స్​ అఫీషియో మెంబర్లుగా పార్టీ అధికార ప్రతినిధులు, పీసీసీ నేతలు ఉంటారు. 

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: 

జాతీయ నాయకత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత ఈ కమిటీదే. ఇంతకుముందు ఈ కమిటీకి చైర్మన్​గా ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ఉండేవారు. ఆయన పార్టీ మారడంతో తాజాగా బలరాం నాయక్​ను ఈ కమిటీకి చైర్మన్​గా నియమించారు. పద్మావతి రెడ్డి  సహా 9 మంది సభ్యులుగా ఉంటారు.

పబ్లిసిటీ కమిటీ: 

కాంగ్రెస్​ చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం కల్పించే పనిని ఈ కమిటీ చూసుకుంటుంది. సభలు, సమావేశాలు, పార్టీ పథకాలపై మీడియా, సోషల్​ మీడియా లేదా నేరుగానైనా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీకి షబ్బీర్​ అలీని చైర్మన్​గా నియమించారు. వైస్​ చైర్మన్​గా ఈ. అనిల్​ కుమార్​ను నియమించారు. గడ్డం వినోద్​, సురేశ్​ షెట్కార్​, కుమార్​ రావు, సంగిశెట్టి జగదీశ్​ సహా పది మంది సభ్యులుగా ఉంటారు. 

కమ్యూనికేషన్స్  కమిటీ: 

పార్టీ నేతలతో కమ్యూనికేషన్​ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి నేతలు, కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్​ను షేర్​ చేసుకునే బాధ్యత ఈ కమిటీదే. కమిటీకి జెట్టి కుసుమ కుమార్​ను చైర్మన్​గా, మదన్​ మోహన్​రావును వైస్​ చైర్మన్​గా నియమించారు. ఇంకో ఏడుగురిని సభ్యులుగా అపాయింట్​ చేశారు. 

ట్రైనింగ్​ కమిటీ: 

పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు సహా అందరికీ వివిధ విభాగాలు, అంశాలపై శిక్షణనిచ్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. బూత్​ లెవెల్​లో ఓటర్​ లిస్టుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల ప్రచార తీరు తదితర అంశాలపై శిక్షణను ఇస్తుంది. ఈ కమిటీకి చైర్మన్​గా పొన్నం ప్రభాకర్​ను ఏఐసీసీ నియమించింది. కన్వీనర్​గా పవన్​ మల్లాదికి బాధ్యతలు అప్పగించింది. జి. నిరంజన్​, కోటా నీలిమ సహా 15 మందిని సభ్యులుగా అపాయింట్​ చేసింది. 

స్ట్రాటజీ కమిటీ: 

ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలను రెడీ చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. దీనికి చైర్మన్​గా ప్రేమ్​సాగర్​రావు వ్యవహరిస్తారు. 12 మందిని సభ్యులుగా ఏఐసీసీ నియమించింది. 

మేనిఫెస్టో కమిటీ: 

ప్రజలను ఆకర్షించే పథకాల రూపకల్పన, వాటి కూర్పు సహా వాటిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబును చైర్మన్​గా వ్యవహరిస్తారు. వైస్​ చైర్మన్​గా గడ్డం ప్రసాద్​కు బాధ్యతలు అప్పగించారు. దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్​, చిన్నారెడ్డి, రాంరెడ్డి దామోదర్​రెడ్డి, సంభాని చంద్రశేఖర్​ సహా 22 మందిని సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలో ఎక్స్​ అఫీషియో మెంబర్లుగా పీసీసీ చీఫ్​, సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ రాష్ట్ర విభాగాల అధ్యక్షులు, ఐఎన్​టీయూసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాల చైర్​పర్సన్లు ఉంటారు. 

ఎన్నికల నిర్వహణ కమిటీ: 

ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అన్ని కమిటీల్లో ఈ కమిటీనే కీలకంగా వ్యవహరించనుంది. ప్రచారం, మేనిఫెస్టో దగ్గర్నుంచి ఎన్నికల సరళి వరకు ఈ కమిటీనే చూసుకోనుంది. ఈ కమిటీకి చైర్మన్​గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను ఏఐసీసీ నియమించింది. వంశీచంద్​ రెడ్డి, కొమ్రయ్య, జ్ఞానేశ్వర్​ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్​, జగన్​లాల్​ నాయక్​, సుప్రభాత్​ రావు, భరత్​ చవాన్​, ఫక్రుద్దీన్​సభ్యులుగా ఉంటారు.