విద్యార్థుల వాయిస్‌ వినండి

విద్యార్థుల వాయిస్‌ వినండి

నీట్‌, జేఈఈ నిర్వహణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు
న్యూఢిల్లీ: నీట్‌‌, జేఈఈ ఎగ్జామ్స్ నిర్వహణపై కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనలు తెలపడంతోపాటు ఈ విషయంపై సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు తెలిపినందుకు ఆ రాష్ట్ర ప్రెసిడెంట్ అనిల్ కుమార్‌‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలో ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

పరీక్షల నిర్వహణ వల్ల స్టూడెంట్స్ హెల్త్, సేఫ్టీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ చీఫ్​ రాహుల్ గాంధీ పేర్కొన్న తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణ గురించి ప్రజలు గొంతెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. స్టూడెంట్ కమ్యూనిటీ వాయిస్‌ను వినాలని కేంద్రాన్ని ప్రియాంక గాంధీ కోరారు. విద్యార్థుల మాటను ప్రభుత్వం వింటుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోనియా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘విద్యార్థులు మన భవిష్యత్. మెరుగైన ఇండియాను నిర్మించే క్రమంలో మనం వారిపైనే ఆధారపడ్డాం. వాళ్ల భవితకు సంబంధించి మనం ఏ నిర్ణయమైనా వారి సమ్మతంతోనే తీసుకోవాలి’ అని సోనియా ఓ వీడియోను ట్వీట్ చేశారు.