పార్లమెంట్ స్పెషల్​​ సెషన్స్ పెట్టండి : కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​

పార్లమెంట్ స్పెషల్​​ సెషన్స్ పెట్టండి : కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​
  • సైనిక, విదేశాంగ విధాన వ్యూహాన్ని చర్చించండి
  • సీడీఎస్​ అనిల్ ​చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించండి
  • కేంద్ర సర్కారుకు కాంగ్రెస్​ డిమాండ్​

న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్‌‌‌‌తో 4  రోజుల పాటు జరిగిన యుద్ధంలో భాగంగా భారత్‌‌‌‌ సైతం ఫైటర్‌‌‌‌ జెట్స్‌‌‌‌ను కోల్పోయిందంటూ చీఫ్​ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ (సీడీఎస్‌‌‌‌) జనరల్​ అనిల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ వ్యాఖ్యల అనంతరం కేంద్రంపై కాంగ్రెస్​తన మాటల యుద్ధాన్ని పెంచింది. ఆపరేషన్​ సిందూర్​ సందర్భంగా సైనిక, విదేశాంగ విధాన వ్యూహంపై చర్చించేందుకు పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేసింది.

సింగపూర్‌‌‌‌లో సీడీఎస్​ చెప్పిన విషయాలను ప్రధానమంత్రి లేదా రక్షణ మంత్రి అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నాయకులకు తెలియజేయాలని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్​) జైరాం రమేశ్​అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సింగపూర్‌‌‌‌లో ఆపరేషన్ సిందూర్ పై సీడీఎస్​జనరల్​ అనిల్ చౌహాన్ కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ప్రధానమంత్రి లేదా రక్షణ మంత్రి ముందుగా అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నాయకులకు వివరించి ఉంటే బాగుండేది” అని పేర్కొన్నారు. 

సింగపూర్​ నుంచి ఈ వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరం

భారత్​కు చెందిన అత్యంత కీలక విషయాలను సింగపూర్, ఇతర ప్రాంతాలనుంచి వివరించడం ఆందోళనకరమని జైరాం రమేశ్​ పేర్కొన్నారు. అవే విషయాలను ప్రతిపక్ష నాయకులకు ప్రధాని ఎందుకు వివరించలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై చర్చించేందుకు తాము అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్​సెషన్స్ పెట్టాలని డిమాండ్​చేస్తున్నామన్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత భారతదేశ రక్షణ సంసిద్ధతపై ఏర్పాటు చేసిన తరహాలో ఆపరేషన్​సిందూర్​పైకూడా ప్రత్యేక సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

ఫైటర్​జెట్స్​కోల్పోయామంటూ సీడీఎస్​ ప్రకటనల నేపథ్యంలోనైనా అలాంటి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు.  ‘‘అమెరికా కాల్పుల విరమణ ప్రకటించగానే.. నాయకులు ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి విదేశాలకు వెళ్లారు. దేశ ప్రజల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?  సాయుధ దళాల నుంచి కాదు..ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి” అని కాంగ్రెస్​ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్​మెంట్​హెడ్​ పవన్​ఖేరా పేర్కొన్నారు. ఆపరేషన్​సిందూర్​ సందర్భంగాఏం కోల్పోయామో చెప్పాలని దేశం మొత్తం అడుగుతున్నదని అన్నారు.