ముగ్గురు మాజీలు భేటి.. అసలేం జరుగుతోంది

ముగ్గురు మాజీలు భేటి.. అసలేం జరుగుతోంది

 ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కీలక మార్పులు జరుగుతున్నాయి.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరిన తర్వాత.. సీనియర్‌ రాజకీయ నేతలతో పాటు.. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్‌.. రాజమండ్రి పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ కాంగ్రెస్‌లో జోష్‌ కనిపిస్తోన్న సమయంలో.. ఈ ముగ్గురు మాజీ ఎంపీల భేటీ హాట్‌ టాపిక్‌గా మారిపోయింది

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ఏపీలో కూడా సత్తా చాటాలని సన్నాహాలు చేస్తోంది.  ఇప్పటికే వైఎస్​ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్​ పార్టీలో చేరింది.  ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్​ కూడా నడుస్తోంది. ఇప్పుడు వైఎస్​ హయాంలో చక్రం తిప్పిన ముగ్గురు కాంగ్రెస్​నేతలు.. మాజీ ఎంపీలు  లగడపాటి రాజగోపాల్​, ఉండవల్లి అరుణ్​ కుమార్​, హర్షకుమార్​  భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమయింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌.. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.. ఆ తర్వాత ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో తన సర్వే ఫలితాలకు.. ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో.. అప్పడి నుంచి సర్వేలకు కూడా స్వస్తి పలికారు.. అయితే, త్వరలోనే లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఆయన రాజమండ్రిలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది.. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోను అని స్పష్టం చేశారు లగడపాటి..

మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్‌తో సమావేశమైన లగడపాటి రాజగోపాల్‌.... రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందన్నారు. తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేసేది లేదన్నారు.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయింది.. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. 

 గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమి సర్వేలు నిర్వహించడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పాలనపై త్వరలోనే ప్రజలు తీర్పు చెబుతారని తెలిపారు. మా భేటీలో ఎటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు లేవు.. రాజమండ్రి వస్తే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్ష కుమార్ లను కలవడం మామూలే అన్నారు లగడపాటి రాజగోపాల్‌. మొదట హర్షకుమార్‌ను కలిసిన ఆయన.. ఆ తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. మరి వారు మళ్లీ కాంగ్రెస్​ లో కీరోల్​ పోషిస్తారా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.