బీజేపీ సంగతేంటి?.. కాంగ్రెస్ కు ఐటీ నోటీసులపై జైరాం రమేష్

 బీజేపీ సంగతేంటి?.. కాంగ్రెస్ కు ఐటీ నోటీసులపై జైరాం రమేష్

కాంగ్రెస్​ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ట్యాక్స్ నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఇది ట్యాక్స్ టెర్రరిజం. కాంగ్రెస్​పై దాడికి దీనిని వాడుతున్నారు. వెంటనే ఇది ఆపేయాలి” అని అన్నారు. బీజేపీ కూడా ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రూ. 4,617.58 కోట్ల పెనాల్టీ వసూలు చేయాలంటూ ఐటీ శాఖకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల స్కాం ద్వారా బీజేపీ రూ.8,200 కోట్లు సేకరించింది.

ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రెయిడ్ బ్రైబ్స్, షెల్ కంపెనీల వంటి వాటిని వాడుకుని ఆ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వసూళ్లకు పాల్పడింది” అని జైరాం ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతుందని, తమ గ్యారంటీలను దేశ ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ ట్రెజరర్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేండ్ల కాలానికి కాంగ్రెస్ ఫైల్ చేసిన ఇన్ కం ట్యాక్స్ రిటర్నులను రీఓపెన్ చేసి వేల కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ అక్రమంగా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ క్యాడర్​కు పిలుపునిచ్చారు.