
- గత సర్కారు చేసిన అప్పులు, కిస్తీలకు కట్టింది రూ.38,040 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం199 రోజుల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు సరిపోవడం లేదు. 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 59,625 కోట్ల రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం 6 నెలల్లో రూ.25,118 కోట్ల అప్పు తీసుకుంది. ఇదే వ్యవధిలో గడిచిన పదేండ్లలో చేసిన అప్పులకు రూ.38,040 కోట్ల రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు) చేసింది.
గడిచిన పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలే తడిసి మోపెడవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకున్న రుణం కంటే ఎక్కువ అప్పులు, కిస్తీలకే చెల్లించింది. అప్పుల భారం అంతకంతకు రాష్ట్ర ప్రజలపై మోపడం కంటే.. కాస్త ఆచితూచి ముందుకు వెళితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.