హైదరాబాద్, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్పార్టీలు కలిసి పని చేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పేపర్ల లీకులు.. కేంద్రంలో బీజేపీ పాలన ఆర్థిక నేరాల మయంగా మారిందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మోదీ హయాంలో బడా వ్యాపారులు బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాలకు పారిపోయారన్నారు. వారు ఎగ్గొట్టిన వేల కోట్ల అప్పులను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించారు.
దేశంలోని సంపదను దోచుకునే పార్టీలు ఒకవైపుంటే.. కాంగ్రెస్ మాత్రమే ప్రజల పక్షాన ఉందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర సర్కార్ ఆటో మోడ్లో నడుస్తున్నదని గెహ్లాట్ ఎద్దేవా చేశారు.