కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో ఆ విషయం స్పష్టమైందని కాంగ్రెస్నేత, మాజీ మంత్రి షబ్బీర్అలీ ఆరోపించారు. అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని చెప్తున్నా, ఢిల్లీలో రహస్య మీటింగ్లు జరుగుతున్నాయన్నారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. డిఫెన్స్ మినిస్టర్తో పాటు, హోమంత్రి అమిత్షాను కూడా కలుస్తున్నారన్నారు.
ప్రధానమంత్రి రాష్ట్రానికి 3 సార్లు వచ్చారని, అప్పుడెందుకు కలువలేదని ప్రశ్నించారు. కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోడానికి సీఎం కానీ, మంత్రి కేటీఆర్ కానీ వెళ్లలేదన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కలుస్తున్నారని, రోడ్ల వెడల్పు కోసం డిఫెన్స్భూములు అడుగుతున్నామని కేటీఆర్ చెప్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపకుండా ఉండేందుకే రహస్య మీటింగులని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి, కమీషన్లపై ఎంక్వైరీ చేస్తాం, లోపల వేస్తామని 2 ఏండ్ల నుంచి బీజేపీ చెప్తోందని, ఢిల్లీ డిప్యూటీ సీఎంను జైల్లో వేసినా, ఎమ్మెల్సీ కవిత మాత్రం బయట ఉన్నారని విమర్శించారు.