
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు , మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు(52) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆదివారం ఉదయం బైక్పై ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో గుండెపోటుతో బండిమీద నుంచి కింద పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మధిరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆత్కూరు గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా జీవనం కొనసాగిస్తూ దారా బాలరాజు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నివాళులర్పించిన డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి మల్లు నందని దారా బాలరాజు మృతేదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి తామున్నామని భరోసా ఇచ్చారు. బాలరాజు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని భట్టి అన్నారు. కాగా, మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకట రమణ గుప్తా, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నిడమానూరు వంశీ, మాజీ జడ్పీటీసీ సూరం శెట్టి నాగభూషణం నాయకులు కర్నాటి రామారావు, పాటిబండ్ల సత్యంబాబు, అద్దంకి రవి, మల్లాది వాసు, రంగా హనుమంతరావుతోపాటు వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు.