రాజకీయాల్లో కేటీఆర్​కు అఆలు కూడా తెల్వదు : జగ్గా రెడ్డి

రాజకీయాల్లో కేటీఆర్​కు అఆలు కూడా తెల్వదు : జగ్గా రెడ్డి
  •     కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్  సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటించి ఉంటే, ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కాదని మాజీ మంత్రి కేటీఆర్ అనడంపై పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్  జగ్గారెడ్డి ఫైరయ్యారు. కేటీఆర్ కు రాజకీయాల్లో అఆలు కూడా తెలవదని ఆయన విమర్శించారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో జగ్గా రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ కు కాంగ్రెస్ గురించి అస్సలు తెల్వదన్నారు.

 ‘‘‘కేటీఆర్  తండ్రిచాటు బిడ్డ. మొన్నటి వరకు సీఏం కొడుకు,  ఇప్పుడు మాజీ సీఏం కొడుకు. కేసీఆర్ కు మాత్రం కాంగ్రెస్ సంప్రదాయం తెలుసు. మా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయం లేదు” అని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 17  సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్  సీటును కాంగ్రెస్  గెలిస్తేనే నిజమైన అచ్ఛే దిన్  వస్తాయన్నారు.