రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సమస్యలు : మహేశ్వర్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే  సమస్యలు : మహేశ్వర్ రెడ్డి

రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలే పార్టీలోని అన్ని సమస్యలకూ కారణమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్  మహేశ్వర్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ సమన్వయంతో పనిచేస్తే సమస్యలు ఎందుకు వస్తాయన్నారు. సీనియర్లు అసంతృప్తితో ఎందుకున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిదేనని..రేవంత్ మెట్టు దిగి అందరితో కలిసి పోవాలని చెప్పారు. కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తోటి కోడళ్ల పంచాయితీ అని రేవంత్ అనడం సరికాదన్నారు.

పదవులు శాశ్వతం కాదని..ఎంత గొప్ప నాయకుడు అయినా..ఏదో ఒక రోజు మాజీ కావాల్సిందేనని మహేశ్వర్ రెడ్డి అన్నారు. బలాబలాలు చూపెట్టుకునే సమయం కాదని..బలప్రదర్శన చేయాల్సింది ఎన్నికల్లోనని చెప్పారు. కమిటీల్లో తమ మనుషులు ఎక్కువ మంది ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి  తమ భాధలు విన్నవించుకుంటామన్నారు.

ఉమ్మడి ఏపీలో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు లేరని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రతీసారి కోవర్టుల చర్చ ఎందుకు వస్తుందని పార్టీలో చర్చ జరగాలన్నారు. పార్టీలో ఆత్మాభిమానికి మించింది ఏదీలేదని..ప్రతి నేత కోరుకునేది ఆత్మగౌరవమేనని చెప్పారు. ప్రత్యర్దులపై ఎందుకు పోరాడలేకపోతున్నామో విశ్లేషించుకోవాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.